Latest News

వైఎస్ కుటుంబంలో 11 ఏళ్ల‌కు ఒక మ‌ర‌ణం...దీని వెన‌క దాగిన ర‌హ‌స్య‌మేంటి?

posted on: Mar 19, 2026 5:12PM

 

దేవ‌త‌ల‌కంటూ మ‌ర‌ణం లేదు. ఉన్న‌ద‌ల్లా రాక్ష‌స మ‌ర‌ణాలు, మానవ‌ మ‌ర‌ణాలు. ఈ మ‌ర‌ణాల్లో.. మాన‌వ మ‌ర‌ణాలు.. పుట్టుక ఎంత‌ స‌హ‌జ‌మో, మ‌ర‌ణ‌మూ అంతే స‌హ‌జంగా ఉంటాయి. వీటి విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలుండ‌వు. అదే రాక్ష‌స  మ‌ర‌ణాలు ఎలాంటివో చూస్తే.. ఇవి రావ‌ణ కాష్టంలా  ఎంత‌కీ చ‌ల్లార‌వు. ఇప్ప‌టికీ అవి అంతులేని ర‌హ‌స్యంగా మిగిలిపోతాయి. అలాంటి మ‌ర‌ణాల్లో వైయ‌స్ కుటుంబ మ‌ర‌ణాలు అత్యంత ఘోర‌మైన‌వి, దారుణ‌మైన‌వి. 

రాజారెడ్డి కావ‌చ్చు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి కావ‌చ్చు, వివేకానంద‌రెడ్డివి కావ‌చ్చు. వీరి మ‌ర‌ణాలు కూడా అంతే మిస్ట‌రీని త‌ల‌పిస్తున్నాయి.ఇప్ప‌టికీ  వైయ‌స్ మ‌ర‌ణం విష‌యంలో ఒక మిస్ట‌రీ దాగి  ఉంది. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించారు. దీనిపై అప్పట్లో అనేక కథనాలు వినిపించాయి.

వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్లే.. హెలికాప్టర్ కూలిపోయిందని అధికారికంగా  ఇటు CBI, అటు DGCA అధికారులు తేల్చారు. అయితే, అత్యంత సురక్షితమైన బెల్- 430 హెలికాప్టర్ అంత సులభంగా ఎలా కూలిపోతుందనేది ఇప్పటికీ కొందరిలో ఉన్న అనుమానం.

అప్పట్లో రిలయన్స్ వంటి బడా సంస్థలకు.. వైఎస్సార్ ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాల వ‌ల్లే.. ఈ ప్రమాదం జ‌రిగింద‌నే మాట వినిపించింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి.హెలికాప్టర్ గల్లంతైన తర్వాత.. కొన్ని గంటల వరకు దాని జాడ తెలియకపోవడం, లోకేటర్ సిగ్నల్స్ పని చేయకపోవడంపై.. సాంకేతికపరమైన సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి.

ఇక రెండోది  వైఎస్ వివేకానంద రెడ్డి మరణం. ఇందులోని మిస్టరీ కూడా ఇప్ప‌టికీ అంతుచిక్క‌కుండా ఉంది. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్య కేసు ఇప్ప‌టికీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇందులో ప్రధానంగా దాగి ఉన్న మిస్టరీలేంటో గ‌మ‌నిస్తే..

మొదటి వెర్షన్- గుండెపోటు. వివేకా చనిపోయినప్పుడు మొదట అది గుండెపోటుగా ప్రచారం జరిగింది. రక్తపు మడుగులో ప‌డి ఉన్న మృతదేహాన్ని చూసి కూడా గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సాక్ష్యాలను తుడిచివేయడానికి ఎవరు ప్రయత్నించారు? అనేది అత్యంత‌ ప్రధానమైన‌ మిస్టరీ.

మిస్ట‌రీ నెంబ‌ర్ టూకి వ‌స్తే.. లెట‌ర్, మొబైల్. వివేకా రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ, ఆయన మొబైల్ ఫోన్ దాచిపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆ లేఖలో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉండటంపై కూడా ఆరా తీస్తోంది సిబిఐ.గొడ్డలి పోటు. పోస్ట్‌మార్టం తర్వాత ఇది గుండెపోటు కాదు, గొడ్డలితో తల వెనుక మోది.. చేసిన‌ హత్యగా తేలింది. ఇంతటి దారుణమైన హత్యకు గల అసలు కారణం ఏమిటి?

ఒక నేరం వెన‌క మోటివ్ తెలిస్తే.. మిగిలినదంతా తెలిసిపోతుందని అంటారు. అలాంటి మోటివ్స్ ఏంటో చూస్తే.. మొద‌టి మోటివ్..  ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఉన్న ఆస్తుల పంపిణీ గొడవలు. ఇక పోతే రెండో పెళ్లి. వివేకా చేసుకున్న రెండో వివాహం కుటుంబ సభ్యులకు నచ్చలేదా? అన్న‌దొక ప్ర‌శ్న‌. మూడోది రాజకీయ కారణం. ఎంపీ సీటు విషయంలో లేదా కడప రాజకీయాల్లో ఆధిపత్యం కోసమా? అన్న అంశాలిక్క‌డ ఎంత‌కీ ముడి వీడ‌టం లేదు.

ప్రస్తుతం సీబీఐ.. ఈ కేసును విచారిస్తోంది. తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ సునీత మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చుతోంది. అవినాష్ రెడ్డి వాదన ఎలాంటిదో చూస్తే.. వివేకా రెండో వివాహం వల్ల వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని, తనను ఇరికించడానికి రాజకీయ కుట్ర జరుగుతోందని అంటున్నారు అవినాష్.

ఇక సునీత రెడ్డి పోరాటం ఏంట‌ని ప‌రిశీలిస్తే.. తన తండ్రిని చంపిన వారు ఎవరో అందరికీ తెలుసని, అధికారంలో ఉన్నవారు నిందితులను కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు ఇన్నాళ్లు. ఇప్పుడు ఆమె అనుమానం వ్య‌క్తం  చేసిన వ్య‌క్తుల‌కు అధికారం లేక పోయినా.. కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ బ‌లంగా ఉంద‌ని భావిస్తున్నారామె.  ఇక వైయ‌స్ తండ్రి రాజారెడ్డి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ కూడా అలాగే ఉందా? అని చూస్తే.. వై.ఎస్. రాజారెడ్డి 1998 మే 23న హతమయ్యారు.  వేముల మండలం, కల్వర్టు ద‌గ్గ‌ర‌ బాంబు దాడితో పాటు, వేటకోడవళ్లతో జరిగిన ఈ దాడిలో ఆయన మరణించారు.

ఇందులో ఎలాంటి మిస్ట‌రీ లేద‌ని అంటారు. ఇది స్పష్టంగా పాత కక్షలు, ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో జరిగిన హత్యగా తేలింది. దీనిపై సిబిఐ దర్యాప్తు జరిగి, కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో ఈ హత్య వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందన్న‌ ఆరోపణలు విన‌ వచ్చాయి. అయితే, ఇది పక్కా ఫ్యాక్షన్ గొడవగా రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా నిందితుల శిక్షను ఖరారు చేసింది.ఇంత‌టి భ‌యంక‌రంగా ఉంటాయి వైయ‌స్ కుటుంబ మ‌ర‌ణాలు. ఒక్కో స‌మ‌యంలో ఒక్కో మ‌ర‌ణం అంతులేని మిస్ట‌రీగా మారి ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను తొలిచేస్తుంటాయి. 

1998లో రాజారెడ్డి మ‌ర‌ణం జ‌నాన్ని తీవ్రంగా ప‌ట్టి పీడించ‌గా.. మ‌రో 11 ఏళ్ల‌కు ఆయ‌న కొడుకు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం కూడా అలాగే జ‌నం నోళ్ల‌లో నాని సంచ‌ల‌నం సృష్టించింది. సుమారు ఇంకో ప‌ద‌కొండేళ్ల‌కు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు వివేకానంద రెడ్డి మ‌ర‌ణం కూడా స‌రిగ్గా అలాంటి సంచ‌ల‌నంగానే మారి.. ఇప్ప‌టికీ అంతు చిక్క‌కుండా ఉంది. ప్ర‌తి ప‌ది, ప‌ద‌కొండేళ్ల మ‌ధ్య కాలంలో సంభ‌వించే ఈ మ‌ర‌ణాలు ఏం చెబుతున్నాయి? ఇవి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను ఎందుకు తొలిచేస్తున్నాయ‌న్న‌ది అంతుచిక్క‌ని మిస్ట‌రీగా మారింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...