వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్

posted on: Apr 28, 2026 7:51PM

 

కడపలో వైసీపీ అభిమానుల సంబరాలు..

 పలుచోట్ల మిఠాయిలు పంచుతూ హంగామా..

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.

అయితే, ఈ కేసులో సీబీఐ పూర్తి చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఇకపై విచారణకు ఆయన అవసరం లేదని భావించిన హైకోర్టు, గతంలో విధించిన షరతులను సడలిస్తూ తాజా ఆదేశాల్లో ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు కడపలో సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.

వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది సహజ మరణం కాదనీ, హత్యని పేర్కొన్నారు.15వ తేదీ సాయంత్రం చేసిన పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయనీ తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటుచేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...