యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసిన అత్త.. కోడలి ప్రాణం బలి!

posted on: Jun 29, 2026 3:16PM

 

సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది. ఒక ఘోర కలియుగ విషాదం. ఇంటర్నెట్‌లో దొరికే అరకొర సమాచారాన్ని, వీడియోలను నమ్మి సొంతంగా వైద్యం చేసుకోవడం ప్రాణాంతకమని హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఉతుకులి తాలూకా పుంజైతళవాయిపాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. 

32 ఏళ్ల కే. శశికళ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆమె భర్త 35 ఏళ్ల కులందైసామి ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. వీరికి ఇప్పటికే ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే, రెండోసారి గర్భం దాల్చిన శశికళకు ప్రకృతి సిద్ధమైన విధానంలో, ఎటువంటి ఆధునిక మందులు లేకుండా ఇంట్లోనే ప్రసవం జరగాలనే విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే గర్భం దాల్చినప్పటి నుంచి ఆమె ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదు, కనీస వైద్య పరీక్షలు లేదా అవసరమైన టీకాలు కూడా వేయించుకోలేదు. ప్రభుత్వ ప్రసవ పర్యవేక్షణ వ్యవస్థ అయిన 'పిక్మీ' (PICME) లో కూడా తన పేరును నమోదు చేసుకోలేదు.  


జూన్ 24వ తేదీ తెల్లవారుజామున శశికళకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా అయితే వెంటనే ఆస్పత్రికి తరలించాలి, కానీ వీరు మాత్రం ఇంట్లోనే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నారు. శశికళ భర్త కులందైసామి, ఆమె అత్త పళనియత్తాల్ కలిసి యూట్యూబ్‌లో సహజ ప్రసవం ఎలా చేయాలనే వీడియోలను చూస్తూ కాన్పు చేయడానికి సిద్ధపడ్డారు.

 యూట్యూబ్ స్క్రీన్ వైపు చూస్తూ, వీడియోలో చెబుతున్న సూచనలను పాటిస్తూ అత్త స్వయంగా కోడలికి ప్రసవం చేసింది. కొంత సమయం తర్వాత శశికళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప క్షేమంగానే పుట్టినా, అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ప్రసవం పూర్తయిన తర్వాత గర్భాశయం నుండి మాయ (Placenta) బయటకు రాలేదు. దాంతో శశికళకు విపరీతంగా అంతర్గత రక్తస్రావం (Post-partum haemorrhage) ప్రారంభమైంది.  

రక్తం మడుగులో అపస్మారక స్థితికి చేరుకుంటున్న శశికళను చూసి కంగారుపడిన కుటుంబ సభ్యులు చివరకు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై ఈరోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె గర్భసంచిని కూడా తొలగించారు. అయినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో జూన్ 25న కోయంబత్తూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు మరణంతో పోరాడిన శశికళ, చివరకు చికిత్సకు స్పందించక జూన్ 28వ తేదీ ఆదివారం ఉదయం కన్నుమూసింది. 

కన్నతల్లి ప్రేమకు నోచుకోకుండా ఆ పసిగుడ్డు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉంది. బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఉతుకులి పోలీసులు భర్త కులందైసామిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద సాపరాధ నరహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ చూస్తూ ప్రసవాలు చేయడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగిస్తోంది.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...