ఐపీఎల్ ఫైనల్ క్రేజ్.. యువకుడి ప్రాణం బలి

posted on: Jun 1, 2026 9:56AM

క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠలో క్షణిక నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.  ఆదివారం (మే 31) ఐపీఎల్  ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుండగా    ఫోన్ లో మ్యాచ్ చూస్తూ..  ఒక  యువ కుడు మృతి చెందిన ఘటన  జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి సమీపంలో  జరిగింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అరుణ్, నివేష్, అశ్విన్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో ప్రయాణిస్తూ మొబైల్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

మ్యాచ్ ఉత్కంఠ పెరుగు తున్న సమయంలో వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం  అదుపు తప్పి  అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించడమే కాకుండా..  సహాయ చర్యలు చేపట్టి   నివేష్, అశ్విన్ లను కాపాడారు... ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. అయితే వాహనం నడుపు తున్న అరుణ్ బావిలో చిక్కుకుని మునిగిపోవడం తో ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు శ్రమించి బావిలో నుంచి అరుణ్ మృతదేహాన్ని, ప్రమాదానికి గురైన కారును బయటకు తీశారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. అరుణ్ మరణం అతని కుటుంబం లో విషాదాన్ని నింపింది... ఐపీఎల్ ఫైనల్ ఆనందం, ఉత్కంఠ మధ్య జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...