కడప వైసీపీ ఖాళీ అయిపోతోందా?

posted on: Mar 2, 2026 3:20PM

వైసీపీకి పెట్టని కోట లాంటి కడప బీటలు వారుతోంది. ఆ పార్టీకి కడప జిల్లాలో ముందు గొయ్యి, వెనుక నుయ్యి వంటి పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే మస్తున్నది. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి గట్టి బలమున్న కడప జిల్లా  ప్రస్తుతం వైఎస్ కుటుంబం పట్టు జారిపోతోంది. వైసీపీని వీడి వెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సొంత జిల్లాలోనే పార్టీ నుంచి వలసనలను నిరోధించడంలో వైసీపీ అధినేత జగన్ విఫలమౌతున్నారు. ఇందుకు ప్రధాన కారణం జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక  కారణమైతే..  రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా  కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది. దశాబ్దాల విశ్వాసాన్ని పక్కన పడేసి జగన్ కు దూరం జరగడానికీ, వైసీపీకి గుడ్ బై చెప్పడానికీ తహతహలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  జిల్లా నేతలు వైసీపీని వీడటానికి సమయం కోసం వేచి చూస్తున్నారన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు తరువాత నుంచీ జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ లో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయం పాలైన తరువాత.. కనీసం ఖర్చులైనా ఇవ్వండంటూ మొరపెట్టుకుంటే పార్టీ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో  ఆ ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సహా.. ఆయనకు మద్దతుగా నిలిచిన వైసీపీయులు ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులుగా మారిపోయారు.   అదలా ఉంటే.. ఇక ఇప్పుడు కడప కార్పొరేషనూ వైసీపీ చేజారిపోయేలా కనిపిస్తున్నది. ఎలాగైనా కడప కార్పొరేషన్ విషయంలో ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీరెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఆమె చొరవతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు   శివ‌కోటిరెడ్డి, రామ్‌ల‌క్ష్మ‌ణ్‌రెడ్డి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి సమక్షంలో సైకిలెక్కేశారు.

 వీరికంటే ముందే   8 మంది కార్పొరేట‌ర్లు దేశం గూటికి చేరిపోయారు. తాజా చేరికలలో కడప కార్పొరేషన్ లో వైసీపీని వీడిన కార్పొరేటర్ల సంఖ్య పదికి చేరింది.  రానున్న రోజులలో మరిన్ని జంపింగ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో వైసీపీ ఖాళీ అవుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు  తూతూమంత్రం చందంగా సాగుతుండటాన్ని చూపుతూ, చుట్టపు చూపుగా జగన్ వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజులలో జిల్లాలో వైసీపీ అసలు ఉందా అన్న వాతావరణమే కనిపిస్తోందని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...