‘వైకాపు’ల కలవరం.. కలకలం...

posted on: Mar 16, 2015 11:27AM

 

ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని, తుంటిమీద కొడితే పళ్ళు రాలినట్టు అనే సామెతలు తెలిసినవే. ఇప్పుడు జగన్ పార్టీ వైకాపాలో అంతర్గత రాజకీయాలు ఈ సామెతకు తగ్గట్టుగా తయారయ్యాయి. ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన పరిస్థితులు ఇంతకాలం పార్టీకి ‘కాపు’గాసిన వారికి పార్టీలో మనశ్శాంతిగా వుండలేని పరిస్థితులు తెచ్చిపెట్టాయి. సిట్యుయేషన్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం పార్టీలోని వ్యక్తులు కాదు.. అసలు వైసీపీకి ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్. ఆశ్చర్యగా వుందా? నమ్మశక్యం కావడం లేదా? కానీ, ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్. వై‘కాపు’లలో కలవరం, కలకలం రేగడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా కారణమయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే....

 

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌కి జనాల్లో ఎంత క్రేజ్ వుందో, ఆయన సామాజికవర్గమైన కాపులలో కూడా అంత క్రేజ్ వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజికవర్గం కొన్ని దశాబ్దాలుగా తమనుంచి సరైన నాయకుడు లేక చాలా వెలితిగా ఫీలవుతోంది. సంఖ్యాపరంగా రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థితిలో వున్నప్పటికీ తమ నుంచి సరైన నాయకుడు రాలేదే అనే బాధ వీరికి వుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన మీద ఆశలు పెట్టుకున్న వీరందరూ ఆయన జెండా పీకేసి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో షాకయ్యారు. అయితే మొన్నీమధ్యే రాజకీయ రంగప్రవేశం చేసి ‘జనసేన’ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ చుట్టూ వీళ్ళు తమ ఆశల పందిరిని అల్లుకుంటున్నారు. భవిష్యత్తులో తమ నుంచి ‘ముఖ్య’ నేతగా ఎదిగే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీలోని కాపులలో కలకలం రేగేలా చేసింది.

 

ఏపీ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ మొన్నామధ్య పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతే... ఈమాట డైరెక్టుగా వెళ్ళి వైసీపీ నాయకుడు జగన్‌ గుండెని తాకింది. అప్పటి వరకూ తమ పార్టీలోని సీనియర్ కాపు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనుకుంటున్న జగన్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఆ పదవిని శెట్టిబలిజ నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్‌కి ఇవ్వాలని డిసైడ్ చేసేశారు. గోదావరి జిల్లాల్లో కాపులకు దీటుగా నిలిచే సామాజిక వర్గం శెట్టిబలిజ. తమ నాయకుడిని కాదని తమకు వ్యతిరేకంగా వుండే సామాజికవర్గం నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వైసీపీలోని కాపు నాయకులందరూ లబోదిబో అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కాపుల అండదండలతో తాను సీఎం అవ్వాలని ఓవైపు జగన్ భావిస్తుంటే, మరోవైపు కాపుల ఇష్టుడు పవన్ కళ్యాణ్ మాత్రం మరో పదేళ్ళపాటు చంద్రబాబే సీఎం అని అనడంతో జగన్ హర్టయ్యారట. ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయే కాపు నాయకులకు తాను ఎందుకు పదవులు ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి మొండిచెయ్యి ఇచ్చారట. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు తిరిగి, ఇటు తిరిగి ఉమ్మారెడ్డి పదవికి ఎసరుపెట్టేసరికి వైసీపీలోని కాపు నాయకులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారట.

google-ad-img
    Related Sigment News
    • Loading...