వైసీపీకి మోడీయే దిక్కు.. కుండబద్దలు కొట్టేసిన నల్లపురెడ్డి

వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా? ఇదే విషయాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా పార్టీ అధినేత జగన్ కు చెబుతున్నారా?  అసలు 2024 ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయానికి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడమే కారణమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఈ పార్టీ సీనియర్ నేతల మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు,  కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి   పార్టీకి భవిష్యత్ ఉండాలంటే జగన్ మోడీని శరుణు వేడి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా.. 2024 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీ పరాజయానికి కారణమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  కనీసం వచ్చే ఎన్నికలలో అయినా, అంటే 2029 ఎన్నికల నాటికైనా వైసీపీ బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే పార్టీ మనుగడ ఉంటుందని అన్నారు.  ఇదే విషయాన్ని  తాను నేరుగా జగన్ కు కూడా చెబుతానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

2024 ఎన్నికల సమయంలో బీజేపీ కోరినప్పటికీ జగన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశారనీ, అప్పుడు పొత్తు వద్దనుకోవడం వల్లనే వైసీపీ ఆ ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిందని అన్నారు. అలా అనడం ద్వారా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అప్పటి జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోడీ సర్కర్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, అలాంటప్పుడు.. ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడం తప్పేనన్నారు.   కనీసం వచ్చే ఏన్నికలలోనైనా జగన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్నారు. బీజేపీతో పొత్తు ఉంటేనే వైసీపీకి భవిష్యత్ ఉంటుందన్నారు.