గోవా గవర్నర్ భూమిని కబ్జా చేసిన వైసీపీ!

posted on: Jun 30, 2026 10:40AM

వైసీపీ కబ్జాల పర్వం ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిర్మించిన, నిర్మించతలపెట్టిన పార్టీ కార్యాలయాల భూ కేటాయింపులపై మరో సారి చర్చమొదలైంది.  

విజయనగరంలో నిర్మించిన వైసీపీ కార్యాలయం  భూమి ప్రభుత్వానికి కాదనీ, అది తమ కుటుంబానికి చెందిన భూమి అంటూ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు  ఆరోపించారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర గవర్నరే వైసీపీ తమ కుటుంబ భూమిని కబ్జా చేసిందంటూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.  తమ కుటుంబానికి చెందిన   భూమిని దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని  వైసీపీ కార్యాలయం నిర్మించారని ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు.  

గోవాగవర్నర్ పూసపాటి అశోకగజపతి రాజు విజయనగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..  గత ప్రభుత్వ హయాంలో చట్టాలను ఏ విధంగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఈ ఘటనే   ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి లేదా కుటుంబానికి చెందిన భూమిని..  రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఎలా చూపిస్తారని ఆయన అప్పటి అధికారుల తీరును నిలదీశారు.   దాదాపు ఏడాది క్రితమే ఈ భూ అక్రమంపై తాను అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని అశోక్ గజపతిరాజు చెప్పారు. ఆ తర్వాత  కొన్ని నెలల క్రితం మరోసారి అధికారులను కలిసి రిమైండర్ ఇచ్చాననీ.. అయినా  ఇంతవరకు  ఎలాంటి  చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.  

బాధితులు ఇచ్చే నిజమైన ఫిర్యాదులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన యంత్రాంగం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే..  ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉంటూ ఇలాంటి ఆరోపణలు చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను గోవా గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు స్వీకరించడానికి ముందే తెలుగుదేశం పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనే నియమం ఉందే తప్ప, తన స్వంత కుటుంబ ఆస్తులకు, హక్కులకు నష్టం వాటిల్లినప్పుడు ఒక పౌరుడిగా మాట్లాడకూడదనే నిబంధన ఎక్కడా లేదని అశోకగజపతిరాజు పేర్కొన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...