రాయలసీమ లిఫ్ట్ కోసం వైసీపీ ఉద్యమం.. సజ్జల

posted on: Mar 2, 2026 11:34AM

రాయలసీమ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం తక్షణం పూర్తి చేయాలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ కోసం వైసీపీ చేపట్టిన ఉద్యమం,  ప్రభుత్వం మెడలు వంచే వరకూ ఆగదన్నారు.    పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న రోజులలో రాయలసీమ లిఫ్ట్ కోసం  ఉద్యమ కదన రంగంలోకి స్వయంగా దిగుతారని ఆయన చెప్పారు.  ఇది కేవలం రాయలసీమ సమస్య కాదు, రాష్ట్ర మొత్తం సమస్య అన్న ఆయన   రాయలసీమ లిఫ్ట్ విషయంలో కూటమి నాయకులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

కడప మేడా కన్వెన్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ పూర్తి కోసం భవిష్యత్ కార్యాచరణపై జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం (మార్చి 1)  జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి..  ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును మరోసారి చేపడుతుండడంపై  ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు అక్రమంగా వ్యవహరిస్తున్నా సీఎం నారా చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరాన్ని అడ్డంగా నరికేస్తున్నారనీ, రాయలసీమ లిఫ్ట్ 90 శాతం పూర్తయినా కావాలనే ఆపేశారని ఆరోపించారు.

పోలవరం స్పిల్‌వే వరకూ పూర్తి చేస్తే రాయలసీమ ఆశలు సాకారమయ్యేవనీ, కానీ చంద్రబాబు ఆ అవకాశాలను సమాధి చేశారని ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణ నీళ్ల దోపిడీ మరింత పెరుగుతుందని అన్నారు. రైతులు, ప్రజలు రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతను అర్థం చేసుకునేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నాయకులకు పిలుపునిచ్చారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులు కూడా చంద్రబాబును ప్రశ్నించాలన్నారు.   మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రతిపాదించిన భవిష్యత్ కార్యాచరణ తీర్మానాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...