లాటరీలో గెల్చినవారే ఇండో-పాక్ మ్యాచ్‌ను చూడగలరు!

posted on: Mar 19, 2016 11:46AM

 

టి-20 ప్రపంచ కప్ సందర్భంగా 65,000 పైగా సామర్థ్యం కలిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియం నేడు కిటికిటలాడనుంది. కానీ ఎంత ఖర్చైనా సరే ఈ మ్యాచ్‌ను చూసి తీరాలనుకున్నవారికి మాత్రం నిరాశ మిగిలింది. కారణం! దేశంలోనే మొట్టమొదటిసారిగా లాటరీ ద్వారా టికెట్లను అమ్మారు. అదికూడా ‘బుక్‌ మై షో’ అనే వెబ్‌సైట్లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం లభించింది. టిక్కెట్లను నేరుగా కౌంటరు వద్ద అమ్మకపోవడం, అది కూడా ఆన్‌లైన్ లాటరీ ద్వారా అందించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. టికెట్ల కోసం లైన్లలో నిల్చుంటే సమయం వృథా అవుతుంది కాబట్టి, ఈసారి ఆన్‌లైన్లోనే టికెట్లను అందిస్తున్నామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. కానీ ఆన్‌లైన్‌ సదుపాయం కానీ, అందులో అనుభవం కానీ లేనివారికి ఈ నిబంధన అన్యాయం చేసిందంటూ అభిమానులు వాపోతున్నారు. మరోవైపు టిక్కెట్ల కోసం బుక్‌ మై షో నిర్వహించిన లాటరీలో టికెట్లను గెలుపొందినవారు, మ్యాచ్‌ను చూసేందుకు ఈపాటికే బయల్దేరిపోయారు. మ్యాచ్‌ను చూసేందుకు కోల్‌కతాకు వచ్చే జనంతో నగరం మొత్తం కిటకిటలాడిపోతోంది. ఇక ఈ మ్యాచ్‌ కోసం దేశవిదేశాల నుంచి వచ్చి అభిమానులతో అక్కడి హోటళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇక మ్యాచ్‌ ప్రారంభం కావడమే ఆలస్యం!

google-ad-img
    Related Sigment News
    • Loading...