Latest News
గండిపేటలో బీఆర్ఎస్ వర్క్షాప్...అసెంబ్లీ వ్యూహాలపై దిశానిర్దేశం
posted on: Mar 10, 2026 5:36PM

హైదరాబాద్లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉమ్మడి ఓరియంటేషన్ వర్క్షాప్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ మూడో బడ్జెట్ కావడంతో దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పదవీకాలం సగానికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని, ప్రజలతో చేసిన మోసాన్ని బడ్జెట్ సమావేశాల్లో బహిర్గతం చేయడానికి పార్టీ వ్యూహరచన చేసిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం కొనసాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తికి ఇవ్వడం తప్ప మరే కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. సెలెక్ట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పిటిషన్స్ కమిటీలు లేకపోవడం, డిప్యూటీ స్పీకర్ కూడా లేకపోవడం శాసనసభ వ్యవస్థను బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం కేవలం బలవంతంగా సభను నడిపిస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ విధానంతో ఇళ్లను కూల్చివేస్తోందని, అదే విధంగా అసెంబ్లీలో కూడా మందబలంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సభలో అబద్ధాలు చెప్పడం, అంకెల గారడీ చేయడం ద్వారా సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాలైనా అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఆరు గ్యారెంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును బీఆర్ఎస్ తరఫున తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.
రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టి ఇతర కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన విమర్శించారు. ఖమ్మం ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, పేద దళితులు, గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో బలంగా లేవనెత్తుతామని తెలిపారు. అలాగే దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు హామీ ఇచ్చిన నిధులు ఎందుకు కేటాయించలేదో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడి అసెంబ్లీ వ్యూహాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శాసనసభ, శాసనమండలి సభ్యుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ నేతలు తెలిపారు.


.webp)



