Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశ : మంత్రి సీతక్క
posted on: May 31, 2026 5:44PM

తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసం, మహిళా భద్రత, బాలికల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాలు గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, యువతుల్లో నాయకత్వ లక్షణాల పెంపును ప్రధాన లక్ష్యాలుగా ముందుకు తీసుకెళ్లాయి.
వారోత్సవాల ప్రారంభ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి భవనాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య కార్యాలయాలు, వర్క్షెడ్లు, గోదాముల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిలుకపచ్చ రంగు యూనిఫాం చీరలను కూడా ఆవిష్కరించారు.
ఖమ్మం జిల్లా మధిరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం వారోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలోనూ విజయవంతంగా రాణించగలరనే సందేశాన్ని ఈ కార్యక్రమం రాష్ట్రానికి అందించింది.
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా POSH చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి సమాజంలో చైతన్యం కల్పించారు.
మహిళలను ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యతనిస్తూ “బలమైన బాల్యానికి 1000 మెట్లు” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముగింపు రోజున నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో చిన్నారులకు యూనిఫారాల పంపిణీ, విద్యారంభ ధృవపత్రాల అందజేత, మహిళల అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలు విశేష స్పందన పొందాయి.
అలాగే స్నేహ సంఘాల బాలికలతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు యువతుల్లో నాయకత్వ సామర్థ్యాలను వెలికితీశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల పాత్ర ఎంత కీలకమో తెలియజేశాయి.
వారంరోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది మహిళలు, బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరగడం, మహిళల్లో వ్యాపార ఆలోచనలు బలోపేతం కావడం, నాయకత్వ లక్షణాలు పెంపొందడం వంటి సానుకూల ఫలితాలు కనిపించాయి.
మహిళా సాధికారతను ప్రజా ఉద్యమంగా మలచాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఈ వారోత్సవాలు బలమైన పునాది వేశాయని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం బలపడుతుందనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.





