డ్రోన్ల నిఘాతో మహిళల రక్షణ.. తమిళనాడు సీఎం విజయ్,

posted on: Jun 10, 2026 2:33PM

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో  కీలక నిర్ణయం తీసుకున్నారు.   ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాలు,  సామాజిక వేధింపుల ఘటనల నేపథ్యంలో  మహిళా రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టానీ, ఇందుకోసం  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని సీఎం విజయ్ నిర్ణయించారు. 

రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను  ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు.  తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.  ఈ సరికొత్త ప్రాజెక్ట్ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీగా పేరుగాంచిన సింగపూర్ డ్రోన్ సాంకేతికతను (రాష్ట్ర ప్రభుత్వం వినియోగించబోతోంది. దీని ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా మహిళల కదలికలపై నిఘా ఉంచి, ప్రమాదకర ప్రాంతాలలో వారికి తగిన రక్షణ కల్పించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మకమైన డ్రోన్ నిఘా ప్రాజెక్ట్ కోసం సీఎం విజయ్  354 కోట్ల రూపాయల  బడ్జెట్‌ను కేటాయించారు. ఈ నిధులతో  అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేయడంతో పాటు, పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తమిళనాడు పోలీస్ శాఖకు ప్రత్యేక యాప్‌లను అందించనున్నారు.  డ్రోన్ల ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ  ఇవ్వడంతో పాటు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. మహిళలకు ఎక్కడైనా ముప్పు పొంచి ఉందని తెలిస్తే, ఈ డ్రోన్ల ద్వారా వెంటనే గుర్తించి పోలీసులు రంగంలోకి దిగేలా ఈ యాప్ ఆధారిత వ్యవస్థ పనిచేస్తుందన్నారు. 

 ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి, గంజాయి సాగుపై నిఘా పెట్టడానికి డ్రోన్ వ్యవస్థను వాడుతుండగా, తమిళనాడులో సీఎం విజయ్   మహిళల భద్రత కోసం ఈ టెక్నాలజీని   రంగంలోకి దించుతున్నారు.  సీఎం విజయ్ తీసుకున్న ఈ   నిర్ణయం పట్ల సర్వతరా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...