Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డీలిమిటేషన్ –రిజర్వేషన్ డ్రామా!
posted on: Apr 20, 2026 9:58AM

మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన.. అన్నది ఇది నిజంగా బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమ కాళ్లపై గొడ్డలి వేసుకున్నారా?
ఎందుకంటే ఇది ఒక శాసన ఓటమి.. పొలిటికల్ విక్టరీ? సీట్ల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఇవన్నీ లోక్ సభలో సభలో 2/3 మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని మోదీ–షా ఓటమిగా ప్రకటించాయి. అయితే మరో కోణంలో చూస్తే.. ఈ సంఘటన బీజేపీకి 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో ఆ వాదనను వాస్తవాలు, రాజ్యాంగం, చరిత్ర, రాజకీయ గణితం ఆధారంగా విడమరచి చూస్తాం.
1. డీలిమిటేషన్ .. ఇది బీజేపీ ఎత్తుగడ కాదు, రాజ్యాంగం ఆదేశం. ఆర్టికల్ 81 & 82 ఏమంటాయి?
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఉత్తర భారతీయుల కుట్ర కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన డెడ్లైన్.
2. మహిళా రిజర్వేషన్ అమలు .. డీలిమిటేషన్ లేకుండా అసాధ్యం. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆర్టికల్ 334ఏ స్పష్టంగా రిజర్వేషన్ అమలు డీలిమిటేషన్ తర్వాతే అని పేర్కొంది. అంటే.. డీలిమిటేషన్ తప్పనిసరి. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బిల్లులోనే ఉన్న నిబంధన. బీజేపీ ప్రతిపాదించిన 850 సీట్లు, 50% పెంపు ఫార్ములా — దక్షిణాది రక్షణ కోసమా?
కేంద్రం ఏం ప్రతిపాదించిందంటే.. లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెంపు. ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు పెంపు. ఆ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలు. ఈ ఫార్యులా వెనుక లాజిక్ ఏంటంటే.. మొత్తం సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాబల్యం తగ్గదు. జనాభా ఆధారిత న్యాయం కూడా జరుగుతుంది. అంటే.. ఉత్తర రాష్ట్రాలకు కొత్త నియోజకవర్గాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకూ అదనపు సీట్లు. ఎవరికీ నష్టం లేకుండా సమతుల్యం.
ఇది దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం అని కేంద్రం అంటోంది. అయితే.. ప్రతిపక్షాలు ఈ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి వాదన ఏంటంటే.. ఈ బిల్లు పాస్ అయితే.. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ప్రాబల్యం దక్కుతుంది.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. 50శాతం పెంపు ఫార్ములా తిరస్కరించబడినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమి, డీఎంకేలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక నష్టం.
5. బీజేపీ నేరేటివ్ మేము రక్షించడానికి ప్రయత్నించాం, వారు అడ్డుకున్నారు. ఈ నినాదంతో బీజేపీకి ఒక స్పష్టమైన ప్రచార మార్గం లభించింది. ఇక మేం మహాళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు బిల్లు తెచ్చాం. కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 50శాతం పెంపును కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది.
ఉత్తర రాష్ట్రాలకు
ఇకఈ బిల్లు వీగిపోవడం వల్ల ఉత్తరాదిలో కూడా బీజేపీకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది. జనాభా పెరిగింది. సీట్ల పెంపును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసే అవకాశం వచ్చింది. ఇది 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం బీజేపీకి లభించింది.
6. ప్రతిపక్షాల వ్యూహపరమైన తప్పు.. ప్రతిపక్షాలు పార్లమెంట్లో బిల్లును ఓడించడంపై ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రజల (ఓటర్ల) మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఇది బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మార్చేసింది.
7. డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది?ప్రతిపక్షాలు 50% పెంపు ఫార్ములాను తిరస్కరించినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ఇది రాజ్యాంగం చెప్పిన మార్గం. దీనిని ఆపడం అసాధ్యం.దీని వల్ల ఉత్తర రాష్ట్రాలకు భారీ లాభం. అదే సమయంలో దక్షిణాదికి తీరని నష్టం. దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రం తమిళనాడు.
8. ముగింపు: ఇది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమను తాము బలహీనపరుచుకున్నాయా.. అంటే.. పరిశీలకులు రెండోదే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ నేరేటివ్, దక్షిణాదికి రక్షణ కోసం ప్రయత్నించిందన్న గుర్తింపు. ప్రతిపక్షాలే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చేశారన్న విమర్శ. ఇది నిస్సందేహంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే 2029 ఎన్నికల ప్రచార అజెండాను బీజేపీకి ముందుగానే లభించేసింది.
ఇక విపక్షాలు.. మహిళా సాధికారతను అడ్డుకున్నాయన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే దక్షిణాదికి సీట్ల నష్టానికి కారణమని ఓటర్లు భావిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో నేరేటివ్ నష్టం. వ్యూహాత్మక దూరదృష్టి లోపం. పార్లమెంట్లో ఓటమి బీజేపీకి పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి వ్యూహపరమైన తప్పు కారణంగా 2029లో వారి రాజకీయ ప్రాబల్యం బలహీనపడే అవకాశం ఉంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండూ ముందే నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీనపడటానికి ప్రతిపక్షాలే కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం






