నడి రోడ్డుపై మంత్రిపై మహిళ ఆగ్రహం!

posted on: Apr 22, 2026 7:05PM

 

ముంబైలో నడి రోడ్డుపై మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్‌మహాజన్‌పై ఒక విద్యావంతురాలైన తల్లి మండిపడ్డ తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా విపక్షాల తీరుకు నిరసనగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఇందులో భాగంగా ముంబై వర్లీ ప్రాంతంలో అధికార మహాయుతి కూటమి భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జంభోరీ మైదాన్ నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సిన ఉంది. నిర్ణీత సమయానికి ప్రారంభం కావడంతో భారీగా వాహనాలు ఆ ప్రాంతంలో నిలిచిపోయాయి.

ఇదే సమయంలో తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్తున్న ఓ మహిళ.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆమెలో సహనం నశించిపోయింది. వెంటనే తన కారులో నుంచి దిగి ర్యాలీ మధ్యలోకి వెళ్లి నేరుగా మహారాష్ట్ర జలవనరుల మంత్రి గిరీశ్ మహజన్‌తో ఆమె వాగ్వాదానికి దిగారు. ‘‘ఇక్కడ వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఖాళీగా ఉన్న గ్రౌండ్‌ దగ్గరకు వెళ్లి ర్యాలీ చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. 

ఈ సమయంలో పోలీసులు వారించే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా ఆమె శివాలెత్తిపోయారు. ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఆమె పట్టుబట్టారు.  ‘ఇక్కడ నుంచి పో’ అంటూ ఆ మాతృమూర్తి మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించినస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  వాహనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో రాజకీయ నిరసనలు నిర్వహించే వారికి ఈ వీడియో చెంపపెట్టు లాంటిదని నెటిజన్ల కామెంట్లు హోరెత్తుతున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...