విజయసాయి హితోపదేశ వేణుగానాలు జగన్ చెవికెక్కుతాయా?
posted on Jan 21, 2026 10:31AM
.webp)
అత్యంత శక్తిమంతమైన కోటరీ ఉండి కూడా ప్రజలు ఎన్నుకున్న బలమైన ప్రభుత్వాధినేత అయిన వెనిజువెలా అధ్యక్షుడు మదురో ని అమెరికా సేనలు, ఆయన సతీమణితో సహా ఆయన నివాసంలోనే బంధించి తీస్కెళ్తుంటే ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు.. ప్రజా జీవితంలో ఉండే నాయకులు కోటరీలు అమ్ముడు పోవడం వల్లే.. ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటారు అనే అర్ధం వచ్చేలా మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్నిటికీ మించి మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు విజయసాయి హాజరు కావడానికి రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది.
ఎందుకంటే విజయసాయి కామెంట్స్ లోని రెండు అంశాలు ఇక్కడి నేటివిటీని కనెక్ట్ చేశాయి. అందులో మొదటిది జగన్ కాగా.. రెండోది ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజయసాయి జగన్ కు అత్యంత సన్నిహతులలో ఒకరు. సరే అది గతం అంటారా, ఓకే. కానీ జగన్ సంపదను మదుపు చేయడం మాత్రమే కాక.. ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది రావడం లేదంటే.. దాని వెనుక ఉన్న శక్తి, యుక్తి విజయసాయిదే. జగన్ పార్టీ నుంచి అన్ని పదవుల నుంచి విజయసాయి బయటకు వచ్చేశారు. కాబట్టి ఆయనకు జగన్ తో ఎలాంటి సత్సంబంధాలు లేవని అంతా భావిస్తుంటారు. కానీ, ఇప్పటికీ జగన్ ఆస్తిపాస్తుల వివరాలు, లెక్కా పత్రాలు, జమాఖర్చులను చూస్తోంది సాయిరెడ్డి టీమే. సాయిరెడ్డి కేవలం రాజకీయంగా మాత్రమే జగన్ కు దూరమయ్యారు తప్ప, జగన్ తో వ్యక్తిగత, ఆర్థిక సంబంధాలు ఇసుమంతైనా దెబ్బతినలేదని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాజకీయం వేరు.. విజయసాయి రెడ్డి వృత్తి అదే చార్టెడ్ అక్కౌంటెంట్ వేరు.
విజయసాయిరెడ్డి చెబుతున్న కోటరీ విషయానికి వస్తే... ఆయన గతంలో పార్టీకి ఎంత కీలకంగా పని చేశారో చూడాలి. సొమ్మొక్కరిదీ, సోకొకరిదీ అన్నట్టు 2019లో వైసీపీ విజయం వెనుక విజయసాయిరెడ్డి పాత్రే కీలకం. చంద్రబాబు గురించి అలెర్ట్ చేస్తూ స్వయంగా తన వాయిస్ రికార్డ్ చేస్తూ దాన్ని కూడా వైరల్ చేసి.. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం సాధించ గలిగారు. అయితే ఇవేవీ గుర్తించని జగన్ విజయ సాయి అప్పటికీ- ఇప్పటికీ- ఎప్పటికీ తన ఛార్టెడ్ అక్కౌంటెంటే.. అన్నట్లుగా లైట్ తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విజయసాయిని కేవలం తన గుమస్తా అన్నట్లుగా జగన్ ట్రీట్ చేశారు. ఈ తరువాత సకలశాఖల మంత్రి సజ్జల ఎంట్రీతో.. విజయసాయిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సరే తరువాత 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే ఆ పరాజయం తరువాత కూడా జగన్ విజయసాయిని రాజకీయంగా దగ్గరకు తీయలేదు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వైసీపీకి దూరమయ్యారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి.. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ రాజకీయ సన్యాసం ప్రకటించేశారు.
అంతే కానీ ఎక్కడా జగన్ పై విమర్శలు చేయలేదు. కానీ జగన్ కోటరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు, హెచ్చరికలూ మాత్రం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన వెనిజువేలా అధ్యక్షుడి ఉదంతాన్ని ఉటంకిస్తూ.. ఈ అమ్ముడు పోయిన కోటరీ పట్ల జాగ్రత్తగా ఉండమని జగన్ శ్రేయస్సు కోరే హెచ్చరిం చారంటే.. విజయసాయి స్వామి భక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. కోటరీ ఎంత బలమైనదో ఇప్పుడు విజయసాయి చెబుతున్నారు కానీ, గతంలో నే మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా చెప్పారు. ఆ కోటరీ జగన్ చెవులు మూసేసిందని అంటున్నారు. అందుకే కోటరీ చట్రంలో బందీ అయిన జగన్ అప్రమత్తం చేయడానికి విజయసాయి వెనుజువెలా అధ్యక్షుడితో పోల్చి చెప్పారు.
ఇక జగన్ విషయానికి వస్తే.. రప్పా రప్పా అంటూ వీధుల్లో చేరి బ్యానర్లు కట్టి, జంతు బలులు ఇచ్చి మరీ పేట్రేగి పోవడంతో జనం జడుసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. గత ఎన్నికలలో వచ్చిన పదకొండు స్థానాలూ, 2029 ఎన్నికలలో ఒకటికి పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటు న్నారు. అది గుర్తించే విజయసాయి జగన్కి హితోపదేశ వేణుగానం వినిపించే యత్నం చేస్తున్నారం టున్నారు.