మమతా బెనర్జీకి శిక్ష పడుతుందా?

posted on: Jun 3, 2026 4:45PM

తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతాబెనర్జీ..  పశ్చిమబెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మర్చేసిన నాయకురాలు.. నిరాడంబరమైన రూపం, అతి సామన్య జీవనశైలితో బెంగాల్‌లో వామపక్షాల 34 ఏళ్ల పాలనను చెక్ పెట్టిన మట్టి మనిషి.  మా, మట్టి, మానుష్’ నినాదంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, హింస రహిత రాజకీయాల వాగ్దానంతో గద్దెనెక్కి.. ఏకంగా మూడు సార్లు అప్రహాత విజయాలు సాధించి, 2011 నుంచి 2026 వరకు పశ్చిమబెంగాల్‌కు కిరీటం లేని మహారాణి అయ్యారు. 

నాణానికి మరోవైపు..  ఆ పదిహేనేళ్ల పాలనలో ఆమెపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్లో గత దశాబ్దన్నర కాలంగా సాగిన నియామక కుంభకోణాలు, కట్ మనీ సంస్కృతి, రాజకీయ హింస, సందేశ్ ఖాలీ వంటి ఘటనలు .. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది ఒక వ్యక్తి వైఫల్యం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ పతనం అన్న అభిప్రాయం ఉంది. పార్టీలో ఏకఛత్రాధిపత్యంతో ఆధిపత్యం,  పరిపాలనపై సోలో ఇమేజ్,  స్థానిక స్థాయిలో గూండా రాజ్‌ను ప్రోత్సహించడం,  ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి, ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేయించి ఊరు విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు కల్పించడం వంటి అంశాలు మమతా పాలనకు తెర దించాయన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి ఇంత శాతం అని కట్ చేస్తూ.. కట్ మనీ సంస్కృతిని ఆమె బహిరంగంగానే అమలు చేశారంట. 

గత పదిహేనేళ్లుగా పశ్చిమ బెంగాల్ అవినీతి, రాజకీయ హింస, దోపిడీలు, ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలు,  పరిపాలనా వైఫల్యాలకు పశ్చిమ బెంగాల్ నిలయంగా మారింది.  సందేశ్‌ఖాలీ  ఘటన కేవలం ఒక కుంభకోణం మాత్రమే కాదు, అది ఒక అరాచకం. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లా సందేశ్‌ఖాలీ గ్రామంలో  2024 ప్రారంభంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై మహిళలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. బలవంతపు భూకబ్జాలు, సామూహిక లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్థానిక నేత షేక్ షాజహాన్, అతని అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడంతో... దాదాపు 55 రోజుల పాటు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్‌ను 2024 ఫిబ్రవరి 29న పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అధికారం, రాజకీయ అండదండలు ఉంటే చట్టానికి అతీతంగా వ్యవహరించవచ్చనే దుస్సంస్కృతికి అద్దం పట్టింది.

అలాంటి టీఎంసీ పాలనలో సామాన్య ప్రజలు న్యాయంపై నమ్మకం కోల్పోయి..  భయంతో రాజీపడి బతకడం నేర్చుకున్నారన్న విమర్శలున్నాయి. అందుకే 2026 ఎన్నికల్లో ప్రజలు కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ఓటు వేయలేదు, భయం శాశ్వతం కాకూడదని ఓటు వేశారు.  పోటీ చేసిన నియోజకవర్గంతో సహా మమతా రాష్ట్రంలో ఘోరపరాజయం పాలైన తర్వాత కూడా..  తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని, గవర్నర్‌ను కలిసేది లేదని నానా హడావుడి చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు పాత పాపాలకు సంబంధించి మమతా బెనర్జీకి శిక్ష పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. 

మన వ్యవస్థలు చట్టం వైపు నిలబడితేనే అది సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.  మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎవరికీ శాశ్వత రక్షణ ఉండదు. అవినీతి, నేరపూరిత కుట్రలు, దర్యాప్తులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగంపై ఆధారాలు లభిస్తే, భారత చట్టం ప్రకారం విచారణ సాధ్యమే. కానీ..  కేవలం రాజకీయ ఓటమి మాత్రమే నేరానికి సాక్ష్యం కాదు. కోర్టులకు బలమైన ఆధారాలు, ఆర్థిక లావాదేవీల చిట్టా, సాక్షుల వాంగ్మూలాలు కావాలి. అక్కడే చాలామంది శక్తివంతులు తప్పించుకుంటారు.

ఎలాగూ ఓడిపోయారు కదా అనిప్రజా ఆగ్రహం తగ్గుతుంది, కేసులు నత్తనడకన సాగుతాయి, సాక్షులు మాట మారుస్తారు. భారతదేశంలో ఇలాంటి పరిణామాలు మనం చాలా చూశాం. అయితే.. బెంగాల్ పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. ఒక రాజకీయ వ్యవస్థ కూలిపోయినప్పుడు, అణచివేతకు గురైన గొంతులు బయటకు వస్తాయి. భయం తగ్గినప్పుడు, నిజాలు బయటపడతాయి. ఇది శిక్షను ఖాయం చేయకపోవచ్చు కానీ..  ఏళ్ల తరబడి జరిగిన తప్పులకు బాధ్యతను నిలదీసే అవకాశం కల్పిస్తుంది. తప్పు రుజువైతే... శిక్ష కఠినంగా ఉండాలి. జైలు శిక్ష, అక్రమ ఆస్తుల జప్తు, ప్రజా పదవుల నుంచి తొలగింపు, బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలి. ఇది ప్రతీకారం కాదు, చట్టం చేయాల్సిన పని. వ్యవస్థీకృత అవినీతి, నేరపూరిత రాజకీయాలు చేసి కూడా ఎవరూ శిక్ష అనుభవించకుండా బయటపడితే... అది భారతదేశానికి ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని పంపే అవకాశముంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...