మళ్లీ బాంబులేస్తాం.. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక!

posted on: Jun 18, 2026 3:02AM

అమెరికా, ఇరాన్ దేశాల శాంతి ఒప్పందంపై మళ్లీ నీలినీలు కమ్ముకున్నాయి.  ఇరు దేశాల మధ్యా గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో  ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యయి. అయితే ఇలా ఒప్పందం కుదిరిందన్నఆనందం అలా ఆవిరైపోయేలా అగ్రరాజ్యాధినేత.. మళ్లీ యుద్ధ గర్జనలు చేస్తున్నారు.  ఇరాన్‌తో   ఒప్పంద ముసాయిదా   తనకు నచ్చకుంటే.. ఆ దేశంపై మళ్లీ దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ట్రంప్  ప్రకటనతో ఇప్పటికే ఎంతో సున్నితంగా ఉన్న పశ్చిమాసియా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ7  సదస్సు వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో కలిసి ట్రంప్ అంతర్జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సందర్భంగా  అమెరికా,  ఇరాన్ దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందం గురించి మీడియా ప్రశ్నలకు, ట్రంప్  స్పందించారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోయే ఈ డీల్ ఇంకా తుది రూపం దాల్చలేదని చెప్పిన ట్రంప్..  ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నడుస్తున్న చర్చలు  ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం   మాత్రమేనన్నారు, దీనిని పూర్తి స్థాయి ఒప్పందంగా భావించలేమన్నారు.  

అదే సమయంలో ఆయన ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు.  ఆ ఒప్పందం తనకు నచ్చకపోతే   ఇరాన్ పై మళ్లీ దాడులు చేస్తాం. వారి తలలపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.  ట్రంప్ హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాలను విస్మయానికి గురి చేసింది.  

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ట్రంప్ వ్యాఖ్యలు ఆటంకం కలిగించేవిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వం ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఒప్పంద చర్చలు జరుగుతుండగానే, మరోవైపు సైనిక దాడులు,  బాంబుల వర్షం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...