సువార్త బోధనలపై ఎందుకు ఆసక్తి తగ్గిపోతోంది?

posted on: Jun 10, 2026 4:16PM

ఎవాంజెలికల్ థియాలజీని.. అంటే క్రిస్టియన్ మత ప్రభోదకులు చెప్పే సువార్త బోధనలు. ఎవాంజెలికల్ థియాలజీని నమ్ముతున్న చర్చిలు, చాలా మంది క్రిస్టియన్లు దాని ప్రాథమిక సిద్ధాంతాలు, సంస్థాగత పద్ధతుల పట్ల విముఖతతో నిశ్శబ్దంగా వాటికి దూరమవుతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాలక్రమేణా మతపరమైన ఆచారాలు, బోధనలలో వస్తున్న మార్పులు, సామాజిక కారణాల వల్ల ఈ ధోరణి పెరుగుతోందంట. 

ఎవాంజెలికల్ చర్చిలు సాంప్రదాయ బైబిల్ బోధనలకు ప్రాధాన్యతనివ్వడం మాని, సామాజిక క్లబ్బులు లేదా వినోద వేదికలుగా మారుతున్నాయని చాలా మంది అసహనంతో కనిపిస్తున్నారు. పాస్టర్ల వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ ధోరణులు, స్పష్టమైన బైబిల్ మార్గదర్శకాలను పక్కతోవ పట్టించేలా వ్యవహరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమంటున్నారు. దాంతో చాలా మంది ఆదివారం సువార్త బోధనలకు వెళ్లే అలవాటును క్రమక్రమంగా వదిలేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే మార్పులు, వలసలు, లేదా చిన్న చిన్న ఘటనలు కూడా దానికి కారణం కావచ్చన్న వాదన కూడా ఉంది. మత విశ్వాసులు ఇప్పుడు భవనాలకు లేదా ఒక నిర్దిష్ట వ్యవస్థ బోధనలకు పరిమితం కావడం లేదని,  పాడ్‌క్యాస్ట్‌లు, ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లు, లేదా చిన్న గ్రూపుల ద్వారా ఆధ్యాత్మికతను పంచుకుంటున్నారు. 

ఎవాంజెలికల్ అనేది సువార్తక విశ్వాసం కంటే, ఒక నిర్దిష్ట రాజకీయ, సాంస్కృతిక శిబిరానికి సంకేతంగా మారిపోవడంతో, అనేక చర్చిలు ఆ లేబుల్‌ను నిశ్వబ్దంగా వదిలేస్తున్నాయి. 2006లో అమెరికా జనాభాలో 23%గా ఉన్న వైట్ ఎవాంజెలికల్ ప్రొటెస్టెంట్లు, 2023 నాటికి 13.5%కు పడిపోయారు; సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ సభ్యత్వం 16.3 మిలియన్ల నుండి 13.2 మిలియన్లకు తగ్గిందని గణాంకాలు చెప్తున్నాయి. 
డీకన్స్‌ట్రక్షన్  పేరుతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ పూర్వ ఎవాంజెలికల్ గుర్తింపును విచ్ఛిన్నం చేసుకుంటూ, కొత్త విశ్వాస–అన్వేషణ మార్గాల్లోకి వెళ్తున్నారు. కొందరు ప్రోగ్రెసివ్ క్రైస్తవత్వం వైపు, కొందరు కాథలిక్, ఆర్థడాక్స్, ఆంగ్లికన్ లిటర్జికల్ సంప్రదాయాల వైపు, మరికొందరు పూర్తిగా “నన్స్” వర్గంలోకి మళ్లుతున్నారు.

1940–60ల మధ్య కాలంలో, బిల్లీ గ్రాహం ఆధ్వర్యంలో ఆధునిక ఎవాంజెలికల్ ఉద్యమం ఒక గౌరవనీయ, మధ్య మార్గం  శక్తిగా ఎదిగింది. 1949 లాస్ ఏంజెలెస్ క్రూసేడ్, 1956 క్రిస్టియానిటీ టుడే, 1947 ఫులర్ థియాలజికల్ సెమినరీ , 1942 నాటి నేషనల్ అసోసియేషన్ ఆఫ్  ఎవాంజెలికల్స్  ..ఇవన్నీ కలిసి, ఫండమెంటలిజం, లిబరల్ మెయిన్ లైన్ల మధ్య బైబిల్ నిబద్ధత, బౌద్ధిక చర్చ, సాంస్కృతిక సంబంధం అనే సమతుల్య ప్రతిమను నిర్మించాయి.1979 లో జెర్రీ ఫాల్వెల్ మోరల్ మెజార్టీ, 1988లో ప్యాట్ రాబర్ట్సన్ అధ్యక్ష ఎన్నికల పోటీ, 1977 నాటి జేమ్స్ డాబ్సన్ ఫోకస్ ఆన్ ద ఫ్యామిలీ, రాల్ఫ్ రీడ్ క్రిస్టియన్ కోయలిజేషన్‌లు ఎవాంజెలికలిజాన్ని కుడిపక్ష రిపబ్లికన్ రాజకీయాలతో ముడిపెట్టాయి. 

అబార్షన్, గే హక్కులు, స్కూల్ ప్రార్థనలు, క్రియేషనిజం, కల్చర్ వార్ అంశాలు – ఇవన్నీ ఎవాంజెలికల్ థియాలజీతో కలిసిపోయి, ప్రజల్లో ఎవాంజెలికల్- కుడిపక్ష రిపబ్లికన్ అనే భావన పెంచాయి. 1990 -2000 మధ్యకాలంలో మెగా చర్చిల మోడల్, టెలివిజన్ ఎవాంజెలిజం, చర్చిలో ఓటర్ గైడ్లు ఇవన్నీ యువ ఎవాంజెలికల్స్లో అసౌకర్యాన్ని పెంచాయి. 2016లో డొనాల్డ్ ట్రంప్‌‌కు 81% వైట్ ఎవాంజెలికల్ ఓటు రావడం, అనేక మంది యువ, మధ్యతరగతి విశ్వాసులకు బ్రేకింగ్ పాయింట్ అయింది. జెర్రీ ఫాల్వెల్ జూనియర్, రాబర్ట్ జెఫ్రెస్, ఫ్రాంక్లిన్ గ్రాహం, పౌలా వైట్ వంటివారు ట్రంప్‌కు మద్దతిచ్చి.. ‘క్యారెక్టర్ ముఖ్యం’ అని రాజకీయ లాభం కోసం చేసిన ప్రచారం.. పలువుర్ని సువార్త బోధనలకు దూరం చేసిందంటారు. ఆ క్రమంలో  బెత్ మూర్, రస్సెల్ మూర్ వంటి ప్రముఖులు సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ను విడిచిపెట్టి,  అంతర్గత సంస్కరణకు చేసిన ప్రయత్నాలు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాయి. 

సదర్న్ బాప్టిస్ట్ కన్వెన్షన్ 1984లో మహిళల ఆర్డినేషన్‌కు వ్యతిరేక తీర్మానం జరిగింది. ఇవి మహిళల నాయకత్వాన్ని పరిమితం చేసింది.2023లో SBC రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా పాస్టర్లను చర్చిలు బహిష్కరించగా, రిక్ వారెన్ స్థాపించిన సాడిల్ బ్యాక్ చర్చ్‌ను కూడా బయటకు పంపింది. అది మతవిశ్వాసులపై మరింత ప్రభావం చూపించింది. తరతరాలుగా జరుగుతున్న ఇలాంటి పోకడలతో సువార్త బోధనల పట్ల మతవిశ్వాసుల ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. ఎవాంజెలికల్ చర్చిలు  తమ థియాలజీ, లేబుల్, సంస్థాగత అనుబంధాలను వదిలేస్తున్నాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...