కొడాలి నాని రూటెటు? రాజకీయమా? రాజీ ప్రయాణమా?

posted on: Mar 7, 2026 10:11AM

ఆ నాయకుడు చాలా కాలంగా గమ్మున వుంటూ వచ్చారు. సడెన్ గా గొంతు విప్పారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారు?  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నోరెత్తకుండా కుక్కిన పేనులా మెలుగుతూ వచ్చిన ఆ నాయకుడిని ఇప్పటికే చాలా మంది  మర్చిపోయి ఉంటారు.ఇప్పుడొక్కసారిగా ఆయన గొంతు సవరించుకుని పాత బ్రాండ్ తో పాపులరవ్వాలని చూస్తుండటంతో మళ్లీ చర్చలోకి వచ్చారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.  

ఇంత కాలం ఆయన ఎందుకు నోరెత్తకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నోటికి పని చెప్పడానికి ఎందుకు రెడీ అవుతున్నారు?  అంటే... ఆయన ఇంతకాలం నోరెత్తకపోవడానికీ, ఇప్పుడు నోటికి పని చేప్పడానికి ప్రయత్నించడానికీ ఒకే ఒక్క కారణం. అది భయం. ఔను కొడాలి నాని ఇప్పుడు నిలువెల్లా భయంతో ఒణికి పోతున్నారు. మౌనాన్ని కొనసాగిస్తే.. రాజకీయ సమాధి, నోరెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. ఈ రెండు భయాలతో ఆయన ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో తెలియని అయోమయావస్థలో ఉన్నారు.  

తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే. 

ఔను గుడివాడ నానిగా  చెప్పుకునే కొడాలి నాని తన బూతులతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబుపై, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో, అసభ్య పదజాలంతో విరుచుకుపడి వైసీపీ అధినేతకు దగ్గరవ్వడానికి చేసిన ప్రయత్నమే ఆయనను వైసీపీలో నాయకుడిగా ఎదగడానికి దోహదపడింది. అదే వాచాలత.. ప్రజలలో ఆయనపై ఏహ్యభావం కలగడానికీ కారణమైంద. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోటికి హద్దూపద్దూ లేకుండా పోయింది. 

అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరింతో అప్పటి నుంచి కొడాలినాని తన నోటికి తాళం వేసుకున్నారు. నోరు తెరిస్తే.. కేసులు తెరమీదకు వచ్చి జైలు కూడు తినాల్సి వస్తుందన్న భయంతో వణికిపోయారు. తనను అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గుడివాడ నియోజకవర్గాన్ని వదిలేశారు. కూటమి నేతల దృష్టిలో పడకుండా ఉంటే అదే పదివేలన్నట్లుగా ఇంత కాలం గడిపేశారు. అనారోగ్యం, చికిత్స అంటూ సానుభూతి పొందే ప్రయత్నాలూ చేశారు. 

ఏదో ఇలా మళ్లీ ఎన్నికల దాకా గడిపేద్దాం.. ఎన్నికల సమయంలో తడాఖా చూపిద్దాం అన్నట్లుగా వ్యవహరించిన ఆయనకు ఇప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చింది. ఈ  సైలెన్స్ పార్టలో తన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నదన్న భయం పట్టుకుంది. పార్టీలో తనకంటే జూనియర్లు తనను దాటి  ముందుకు వెళ్లిపోతుండటంతో తత్వం బోధపడింది. అంబటి రాంబాబు ఎపిసోడ్ తో తాను రాజకీయంగా ఎంత అనామకుడిగా మిగిలిపోయాన్నది తెలిసొచ్చింది. దీంతో బెటర్ నౌ దేన్ నెవర్ అన్నట్లుగా నాని గొంతు సవరించుకున్నారు. 

అయితే ఆయనలో కేసుల భయం, రాజకీయంగా ఉనికి చాటుకోవాలన్న తాపత్రయం ఒకే సమయంలో సమానంగా ఉండటంతో ఆయన ప్రయాణం రెండు పడవల మీద ప్రయాణంలా తయారైంది.     ఓ వైపు రాజకీయ ఉనికి, మరో వైపు జైలు భయంతో నాని పరిస్థితి  ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది.  కూటమి ప్రభుత్వంపై మాటల దాడి చేస్తే  జైలు   చేయకపోతే,  రాజకీయ సమాధి.  ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలియని పరిస్థితిలో నాని దిక్కుతోచని అయోమయంలో పడ్డారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఈ పరిస్థితుల్లోనే.. ఇటీవల అంబటి నివాసానికి పరామర్శకు వెళ్లిన కొడాలి నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారు. అయితే వాటిలో మునుపటి వాడి, వేడి లేదు. ఏం మాట్లాడితే ఎం ముంచుకొస్తుందో అన్న భయమే కనిపించింది. అయితే తన పాత దూకుడును ప్రదర్శించాలన్న ఆరాటం కూడా నానిలో కనిపించింది. చూడాలి మరి రాజకీయ భవిష్యత్ కోసం పాత తరహాలో నోరు చేసుకుంటారా? లేక కేసులు, జైలు భయంతో తన నోటిని అదుపులో ఉంచుకుంటారా?

google-ad-img
    Related Sigment News
    • Loading...