మూత్రాన్ని ఆపుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే..

చలికాలం కష్టం..

చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్.

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు..

మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది.

మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి.

మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.

                                 *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu