సైబర్ క్రిమినల్స్ నుంచి వృద్ధులను కాపాడిన పోలీసులు
posted on: Feb 21, 2026 9:36AM

డిజిటల్ అరెస్ట్ అంటూ.. ఇద్దరు వృద్ధులను మోసం చేయడానికి ప్రయత్నించిన సైబర్ క్రిమినల్స్ నుంచి కృష్ణాజిల్లా ఉయ్యూరు పోలీసులు ఇద్దరు వృద్ధులను రక్షించారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడటం ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇక తాజా ఘటనలో గతంలో అకౌంటెంట్ గా, టీచర్గా పనిచేసి రిటైర్ అయిన 70 ఏళ్ల కోటా శివశంకర్ ఆయన భార్య ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జి కాలేజ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరికి గురువారం (ఫిబ్రవరి 19) ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ కాల్ వచ్చింది.
మీ ఆధార్ కార్డు ద్వారా 25 లక్షల మనీలాంటింగ్ జరిగింది, దానికి సంబంధించి మీపై సుప్రీంకోర్టు నుండి అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ బెదరింపులకు దిగారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిగా ఒకరిని వీడియో కాల్ ద్వారా మాట్లాడించి బ్యాంక్ అకౌంట్ ల వివరాలు, స్థిర చరాస్తులు వివరాలు అన్ని ఇవ్వాలని, ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని చెబితే వెంటనే లోకల్ పోలీస్ వారు వచ్చి అరెస్ట్ చేసి ముంబై పంపిస్తారని బెదరించారు.
అయితే.. గతంలో కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు విస్తృతంగా జరిగిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలు ఉయ్యూరులో కూడా జరగడంతో కొద్ది పాటి అవగాహన ఉన్న శివశంకర్ దంపతులు వెంటనే స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి, వెంటనే అక్కడ చేరుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ అంటూ బెదరిస్తున్న వ్యక్తి స్క్రీన్ మీదకు రాగానే అతనితో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే నిజమైన పోలీసులను చూసి ఆ ఫేక్ పోలీస్ వెంటనే లైన్ కట్ చేసి ఆఫ్లైన్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ పద్ధతి గాని ఎక్కడా లేదని ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా, ఖంగారుపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని ఉయ్యూరు పోలీసులు ప్రజలకు తెలిపారు.






