Latest News
వివేక హత్య కేసు విచారణ సీబీఐ బాధ్యతగా చేయలేదు : సునీత
posted on: Mar 15, 2026 4:48PM

కడప జిల్లా పులివెందుల పట్టణంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ముందుగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఇంటి సమీపంలోని పార్కులో ఉన్న వివేకానంద రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద రెడ్డి భార్య సుగుణమ్మ, కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బామ్మర్ది శివప్రకాష్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రతాప్ రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య కేసును సీబీఐ బాధ్యతగా విచారించలేదని ఆమె ఆరోపించారు. ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక నిందితుల విషయంలో సీబీఐ చెప్పింది వినడమే తప్ప లోతుగా విచారణ జరపలేదని అన్నారు. హత్య అనంతరం నిందితుల మధ్య భారీగా ఫోన్ సంభాషణలు, మెసేజ్లు జరిగినట్లు తెలిపారు.ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణిని కూడా విచారించలేదని పేర్కొన్నారు. కేసులో నిజం బయటపడే వరకు తన పోరాటం కొనసాగుతుందని సునీత రెడ్డి స్పష్టం చేశారు.


.webp)
.webp)


