విశాఖలో బిట్స్ పిలానీ సంస్థ ఏర్పాటు
posted on: Jan 9, 2015 8:20AM
.jpg)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మలిచేందుకు ఎంచుకోవడంతోనే దానికి మహర్దశ మొదలయిందని చెప్పవచ్చును. కానీ మధ్యలో హూద్ హూద్ తుఫాను వచ్చి నగరాన్ని అల్లకల్లోలం చేసి పోయింది. కానీ అంతా మన మంచికే అనుకోక తప్పదు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రయోగం విశాఖ నగరంలోనే అమలవుటోంది. తరువాత కొత్తగా నిర్మించబోతున్న రాజధాని నగరంలో అమలవుతుంది.
ఇక విశాఖ నగరాన్ని ఐ.టీ.హబ్ గా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే కృషి చేస్తున్నారు. నగరం శివార్లలో గంభీరం అనే ప్రాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఏర్పాటుకు జోరుగా సన్నహాలు జరుగుతున్నాయి. ఈనెల ఐదున కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా దాని శంఖుస్థాపన జరుగవలసింది కానీ భూసేకరణ విషయంలో స్థానిక రైతుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కానీ తాత్కాలికంగా ఆంద్ర విశ్వవిద్యాలయంలో గల ఆంధ్రాబ్యాంక్ భవనంలో ఐ.ఐ.యం. కోర్సుల శిక్షణ ఆరంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నగరంలో మూడు ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో రైల్ నిర్మాణానికి సర్వే కూడా మొదలయింది. మరొక ఆరు నెలలలో నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత ఆదిత్య మంగళం బిర్లా తమ బిట్స్ పిలానీ అనుబంధ సంస్థను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. దానితో బాటే ఒక అంతర్జాతీయ పాటశాలను కూడా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. వాటికి అవసరమయిన భూములను ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్దత వ్యక్తం చేసారు. కనుక ఇక విశాఖ నగరానికి బిట్స్ పిలానీ కూడా వచ్చేస్తునట్లే భావించవచ్చును. ఇక రైల్వే జోన్ కూడా వచ్చేస్తే విశాఖవాసులు చాలా సంతోషిస్తారు. కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరించడం కూడా చాలా అవసరం.



.jpg)
.jpg)

.webp)



