మణిపూర్ లో మళ్లీ ప్రజ్వరిల్లిన హింస.. 20 గృహాలు దగ్ధం

posted on: Jul 2, 2026 9:49AM

ఈశాన్య రాష్ట్రమైన  మణిపూర్‌లో  మళ్లీ హింస ప్రజ్వరిల్లింది.   భారత్-మ్యాన్మార్ సరిహద్దు ప్రాంతంలో తెగల మధ్య నెలకొన్న పాత పగలు మళ్లీ  ఒక్క సారిగా భగ్గుమన్నాయి. మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1)   హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో  దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఒకవైపు కుకీ వర్గానికి చెందిన గ్రామం, మరోవైపు తంగ్‌ఖుల్ నాగా తెగకు చెందిన ఆవాసాలు లక్ష్యంగా చేసుకుని   దుండగులు జరిపిన   దాడుల్లో  20కి పైగా ఇళ్లు  అగ్నికి ఆహుతయ్యాయి. గత కొంత కాలంగా   ఉన్న ప్రశాంతత ఈ ఘటనతో పటాపంచలైంది.  

  బుధవారం (జులై1)  ఇండో-మ్యాన్మార్ సరిహద్దు పిల్లర్ నంబర్ 113 సమీపంలో ఉన్న ఫైమోల్ అనే కుకీ గ్రామంపై గుర్తుతెలియని సాయుధ మూకలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. చస్సాద్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని  ఈ గ్రామంలోని ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అయితే..  ఆ ప్రాంతంలో ముందే ఉద్రిక్తతలు ఉండటంతో ఫైమోల్ గ్రామంలోని ప్రజలందరూ ముందే ఇళ్లను ఖాళీ చేసి, 11 అస్సాం రైఫిల్స్ క్యాంప్ రక్షణలో ఉన్న ఐషి గ్రామంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. ఈ కారణంగా ప్రాణనష్టం తప్పినప్పటికీ, గ్రామంలో  15 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.   అస్సాం రైఫిల్స్ తమ భద్రతా పోస్టును అక్కడి నుంచి ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరిగిందని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే, సరిహద్దు పిల్లర్ నంబర్ 101 సమీపంలోని షాంగ్‌ఖలోక్ అనే తంగ్‌ఖుల్ నాగా గ్రామంపై ప్రతీకార దాడులు ప్రారంభమయ్యాయి.  ఈ క్రమంలో షాంగ్‌ఖలోక్‌తో పాటు సమీపంలోని హుయిమినే థానా అనే నాగా సరిహద్దు గ్రామంలోని 7 ఇళ్లను పూర్తిగా కాల్చివేశారు. షాంగ్‌ఖలోక్ గ్రామంలోని మరో 7 నాగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...