బెజవాడ పసికందు మిస్సింగ్‌లో కొత్త ట్విస్ట్..

posted on: Jul 15, 2016 6:51PM

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మాయమైన పసికందు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బిడ్డ మాయమైన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రిలోని ఎస్ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువును గుర్తు తెలియని మహిళ 11 గంటల సమయంలో అపహరించుకుపోయింది. పట్టపగలే అందరూ చూస్తుండగా, ఎస్ఎన్‌సీయూ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు, ప్రసూతి విభాగం వద్ద ఉన్న రెండంచెల సెక్యూరిటీ విభాగాన్ని దాటుకుని శిశువుతో సహా ఉడాయించింది. అనంతరం విజయవాడ బస్టాండ్‌లో మరో మహిళకు బిడ్డను అప్పగించినట్టు పోలీసులు గుర్తించారు.

 

ప్రభుత్వాసుపత్రిలోని సీసీకెమెరా ఫుటేజీని..బస్టాండ్‌లోని సీసీకెమెరాల్లో 11.30 గంటల ప్రాంతంలో నమోదైన దృశ్యాలను సరిపోల్చుకున్న పోలీసులు నిందితురాలిగా అనుమానిస్తూ "మాయమైన బేబితో మహిళ" అంటూ ఓ ఫోటోను పోస్టర్లుగా వేసి రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో అతికించారు. అంతా బాగానే ఉంది కాని ఇక్కడే పోలీసులకు కొత్త చిక్కొచ్చిపడింది. పోలీసులు ముద్రించిన పోస్టర్లలో మహిళ ఓ టీవీ ఛానెల్‌ను ఆశ్రయించారు. సీసీ కెమెరాల్లో కనిపించామన్న ఒకే ఒక్క కారణంతో ఫోటో వేస్తారా..? నేరస్తురాలిగా భావిస్తారా..? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, తమను మానసిక వేదనకు గురి చేశారని గుంటూరుకు చెందిన ధాన్యశబరి ఆరోపించారు.

 

తన చేతుల్లో ఉన్న బిడ్డ తను కన్న బిడ్డ అని, ఫిబ్రవరి 24న గుంటూరులోని హెల్ప్ ఆసుపత్రిలో జన్మనిచ్చానని ఆమె చెప్పారు. ఈ బిడ్డ తనదేనని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలకైనా సిద్ధమని శబరి సవాల్ విసిరారు. సీసీ కెమెరాలు పెట్టారు కదా..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఎక్కడికి వెళ్లారు..? వంటి వివరాలు తెలుసుకోరా..? అని ఆమె పోలీసులను నిలదీశారు. జరిగిన పరువు నష్టానికి, మానసిక క్షోభకు న్యాయం చేయాలని ఆమె పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని ధాన్యశబరి హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...