విజయవాడ తిరిగివచ్చిన మల్లాది విష్ణు

posted on: Jan 5, 2016 11:05AM

 

ఎట్టకేలకు విజయవాడ నగర కాంగ్రెస్ అద్యక్షుడు మల్లాది విష్ణు తన నెలరోజుల అజ్ఞాతవాసం ముగించుకొని ఈరోజు ఉదయం విజయవాడలోని తన స్వగృహం చేరుకొన్నారు. కృష్ణ లంకలో ఆయనకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంటులో కల్తీ మద్యం త్రాగి డిశంబర్ 8వ తేదీన ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఆయనను కూడా నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్దపడటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన విజయవాడ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కానీ దానిని కోర్టు తిరస్కరించింది. రేపటిలోగా లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఆయన ఇవ్వాళ్ళ నగరానికి తిరిగి వచ్చేరు.

 

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధము లేకపోయినా రేపు కృష్ణలంక పోలీసుల ముందు లొంగిపోయి, ఈ కేసు విచారణకు అన్ని విధాల సహకరిస్తానని మీడియాకి చెప్పారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి అన్ని నిజాలు బయటపెడతానని చెప్పారు. స్వర్ణా బార్ అండ్ రెస్టారెంటులో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు మరణించిన వెంటనే, ఆ బార్ తో తనకు ఎటువంటి సంబంధము లేదని, అది తన బంధువులదని వాదించారు. కానీ పోలీసుల విచారణలో ఆ బార్ లైసెన్స్ మల్లాది విష్ణు కుటుంబీకుల పేరిటే ఉన్నట్లు కనుగొన్నారు. ఎక్సయిజ్స్ శాఖ దానిని ద్రువీకరించింది. అప్పుడే ఆయనను ఈ కేసులో తొమ్మిదవ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసారు. అప్పటి నుండి అజ్ఞాతంగ గడిపిన మల్లాది విష్ణు ఇప్పుడు కూడా తనకు ఆ బార్ కి, కల్తీ మద్యం మృతుల కేసుకి ఎటువంటి సంబంధం లేదని వాదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సంబంధం లేదనప్పుడు మరి ఇన్నాళ్ళు పోలీసులకి భయపడి దాక్కోవడం ఎందుకో?

google-ad-img
    Related Sigment News
    • Loading...