రాములమ్మ చూపు.. తెలుగుదేశం వైపు !!

posted on: May 16, 2017 4:50PM

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. అప్పటి నలుగురు అగ్ర హీరోలతోనూ సూపర్ హిట్స్ కలిగిన విజయశాంతికి సోలోగానూ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. చిరంజీవితో 'ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్' వంటి పలు విజయాలు విజయశాంతికి ఉన్నాయి. బాలకృష్ణతో 'ముద్దుల మామయ్య, కథానాయకుడు, లారీ డ్రైవర్' వంటి ఘన విజయాలు కలిగిన విజయశాంతికి.. నాగార్జునతో 'జానకీరాముడు', వెంకటేష్ తో 'శత్రువు' వంటి హిట్స్ ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణలతో పోల్చితే.. నాగార్జున, వెంకటేష్ లతో విజయశాంతి నటించిన సినిమాలు కూడా తక్కువే. ఈ నలుగురుతోనే కాదు.. కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలతోనూ నటించిన ఘనత విజయశాంతి సొంతం.

 

ఇక సోలో హీరోయిన్ గా 'ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ' వంటి బ్లాక్ బస్టర్స్ కలిగి ఉండడం వల్ల.. విజయశాంతిని లేడీ అమితాబ్ బచ్చన అని కూడా పిలిచేవారు. అందుకే.. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే.. రాజకీయాల్లో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. ఈ రంగంలో విజయశాంతికి సరైన విజయాలు ఇవ్వలేకపోయాయి. మొదట బీజేపీలో, తరవాత తెరాసలో, మళ్ళీ బీజేపీలో ఉండి తన రాజకీయ జీవితాన్ని ఎటూ కాకుండా చేసుకొంది విజయశాంతి.

 

త్వరలో మళ్ళీ సినిమా రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విజయశాంతి.. రాజకీయాల్లో కూడా మళ్ళీ క్రియాశీలంగా ఉండాలని యోచిస్తున్నదని తెలుస్తోంది. పైన పేర్కొన్న నలుగురు అగ్ర హీరోల్లో.. నందమూరి బాలకృష్ణతో విజయశాంతికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బాలయ్య-విజయశాంతి నటించిన 'నిప్పురవ్వ' చిత్రానికి అనధికారిక నిర్మాత ఆమెనే. ఆ అనుబంధంతో విజయశాంతి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డికి విజయశాంతి వంటి జనాకర్షక నేత అవసరమని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నదని, తెలుగుదేశం వచ్చిన పిలుపుకు విజయశాంతి కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం!! 

google-ad-img
    Related Sigment News
    • Loading...