తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీకాంత్

posted on: Jun 6, 2026 11:41AM

తమిళనాట మరో రాజకీయ పార్టీ తెరమీదకు రానుంది.  కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించి,  తన  మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక పొలిటికల్ సునామీలా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏ ఇతర రాజకీయ నాయకుడికైనా ఇది ఒక తీరని కల అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే  తమిళనాట విజయ్  సునామీ   ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు  పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పటికే రజినీకాంత్ ఒక సారి రాజకీయ పార్టీ అంటూ హడావుడి చేసి.. వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.  

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ తాజా రాజకీయ అడుగులపై  చర్చ నడుస్తోంది. ఇందుకు  ప్రధాన కారణం రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ ప్రారంభించిన ప్రజా ఉద్యమం. ఆమె తమిళనాడులో  మక్కల్ మేడై అంటే తెలుగులో ప్రజల వేదిక  అనే ఒక పౌర వేదికను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక స్థాయిలో సరికొత్త నాయకులను తయారు చేయడం, వారి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం తన  మక్కల్ మేడై   ముఖ్య ఉద్దేశంగా ఆమె  ప్రకటించారు. ఒక రకంగా ఇది సమాజ సేవకు, రాజకీయ అవగాహనకు సంబంధించిన మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీని వెనుక ఉన్న టైమింగ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే ఈ సంస్థను తీసుకురావడం వెనుక  పొలిటికల్ స్ట్రాటజీ   ఉందని నెటిజనులు అనుమానిస్తున్నారు.  

  దళపతి విజయ్‌కు వస్తున్న విపరీతమైన క్రేజ్, స్టార్‌డమ్ ను రజినీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారా అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.  విజయ్ ఇమేజ్‌ను,  ప్రజాదరణను ఏదో మేరకు  తగ్గించేందుకే రజినీకాంత్ కుటుంబం ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరపైకి తెచ్చిందంటున్నారు.    మక్కల్ మేడై  సంస్థను స్థాపించింది రజినీకాంత్ కాదు, ఆయన భార్య లతా రజినీకాంత్ అయినప్పటికీ.. ఆమో తన సంస్థకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ..  దీని వెనుక ఖచ్చితంగా రజనీకాంత్ ఉంటారనీ, ఉన్నారనీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రజినీకాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దళపతి విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసి తాను ఎంతో సంతోషిస్తున్నానని   చెప్పారు.

అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు  శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఒకవైపు రజినీకాంత్ ఇలా సానుకూలంగా స్పందించినా.. తాజాగా రజనీకాంత్ భార్య ప్రారంభించిన మక్కల్ మేడై సంస్థ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇది కేవలం సేవా సంస్థగానే మిగిలిపోతుందా.. ముందు ముందు  విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ అస్త్రంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీ అన్న చర్చకు కేంద్రంగా మారింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...