విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

posted on: May 10, 2026 12:52PM

 

విజయ్ పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించిన మోదీ..

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కలిసి పని చేస్తామని హామీ..

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాల మధ్య నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన C. జోసెఫ్ విజయ్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలపడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని, విజయ్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన విజయ్ తన ప్రసంగంతో సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించారు. తాను ప్రజల ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడినేనని,అన్నగా-తమ్ముడిగా ఎప్పుడూ ప్రజలతో ఉంటానని చెప్పారు. పేదరికం అంటే ఏమిటో తనకు తెలుసని, ప్రజలు ప్రేమగా రాజకీయాల్లోకి రావాలని పిలిచారని గుర్తుచేసుకున్నారు. అసాధ్యమైన హామీలు ఇవ్వబోనని, సాధ్యమైనవి మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. తనతో ప్రయాణం చేస్తున్న ప్రజలను ఎప్పటికీ మోసం చేయనని హామీ ఇచ్చిన ఆయన, తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని కూడా వెల్లడించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న తొలి నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు తొలి సంతకం చేసిన ఆయన, మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని కూడా సంతకం చేశారు. ఈ నిర్ణయాలు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి.

సామాన్యుడిగా ప్రారంభించి ముఖ్యమంత్రిగా ఎదిగానని చెప్పిన విజయ్, తన కష్టకాలంలో నాతో నిలిచిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. “మీ సోదరుడు ఇప్పుడు సీఎం అయ్యాడు” అన్న ఆయన మాటలు సభలో ఉన్నవారిని కదిలించాయి. తనను విమర్శించే వారు కూడా తన శ్రేయోభిలాషులేనని చెప్పిన విజయ్, యువత తన వెన్నంటి నిలిచినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త దిశ ప్రారంభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...