గోపీనాథ్ అరెస్టు.. ఇక మాజీ మంత్రి విడదల రజనీ వంతేనా?
posted on Apr 24, 2025 10:28AM
.webp)
వైసీపీ నాయకురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది.. విడదల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు. అరెస్టు అనంతరం.. ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.
ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు. యడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదులపై మాజీమంత్రి విడదల రజపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నే విడదల రజిని మరిది గోపినాథ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడదల రజని ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
కాగా సైబరాబాద్ మెక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడదల గోపీనాథ్ ను అరెస్టు చేయడంతో విడదల రజనిని కూడా అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది.