Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో ‘వీబీ జీ రామ్జీ’ పథకం ప్రారంభం..ప్రతి గ్రామానికి 2 కోట్లు నిధులు!
posted on: Jul 2, 2026 5:32PM

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టానికి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు వేదికైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్’ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు.
సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ లు వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్ లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజివికా మిషన్ పోర్టల్ ను నేతలు ప్రారంభించారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." వీబీ జి రామ్ జీ పథకం ఏపీలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం చారిత్రాత్మకం. గతంలో నరేగా రాయలసీమ ప్రాంతం నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతం అయ్యింది. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్ జీ కింద పనులు చేపడతాం. రూ.11 వేల కోట్ల పైచిలుకు మొత్తంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో ఈ పథకం కింద గ్రామాల రూపు రేఖలు మారతాయి. 125 రోజుల పని దినాలతో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన ఏ పనైనా చేపట్టేందుకు వీబీజీ రామ్ జీ కింద అవకాశం కల్పిస్తోంది.
రహదారులు, డ్రైనేజీలు, కాలువలు ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారం ఉండేలా ఈ పథకం వినియోగిస్తాం. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ లాంటి సాంకేతికతతో పూర్తి పారదర్శకంగా ఈ పథకం నిర్వహిస్తాం. గాలేరు నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకువస్తాం, జలధార ద్వారా భూగర్భ జలాలను కూడా పెంచుతాం. రాష్ట్రాలు వ్యయం చేసేలా ఈ పథకం చేపట్టటం భారం కాదు బాధ్యత. 13,226 గ్రామాల్లో ఒకే మారు గ్రామసభలు పెట్టి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కే దక్కింది.
7,000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల ఫార్మ్ పాండ్లు, 1,373 కి.మీ మేర గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరిగింది. ఉపాధి హామీ పనుల నిమిత్తం 55.44 కోట్ల పని దినాలు కల్పించి, రూ.16,695 కోట్లు ఖర్చు చేశాo. ఈ ఏడాది 10 వేల కి.మీ. గ్రావెల్ రోడ్లు, 1,500 కి.మీ. సిమెంట్, బీటీ రోడ్లు, 500 కి.మీ. మేజిక్ డ్రైన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యంగా పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా జీ రామ్ జీ పథకం కింద నిర్మించవచ్చు". అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
రెండేళ్లలో రాష్ట్రాన్ని నిలబెట్టాం..!
జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం అన్నారు. రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి రెండేళ్లలో మాట నిలుపుకున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ "కేంద్రం అమరావతికి సహకారం అందించింది. వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికలు అయ్యాక మరో మాట మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారు.
ఇది ఎవరికైనా అర్ధం అయ్యిందా. అమరావతిని ఆపటం ఎవరి తరమూ కాదు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టటంతో పాటు రైల్వే జోన్ సాధించాం. గూగుల్ డేటా సెంటర్ తో పాటు పుట్టపర్తిలో ఆమ్కా ఫైటర్ జెట్ తయారీ యూనిట్ వస్తోంది. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలుపుతాం. దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రం రాయలసీమ. త్వరలోనే రూ.40 వేల కోట్లతో ప్రభుత్వం, రూ.60 వేల కోట్ల ప్రైవేటు ప్రైవేటు పెట్టుబడులు తెస్తాం. మదనపల్లిలో హార్టీకల్చర్ హబ్ కు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. సత్యవేడులో హీరో మోటార్స్ సైకిళ్ల తయారీ యూనిట్ ఉంది. తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ వస్తోంది.
ప్రజల మనిషి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు, రహదారులు, పీఎంఏవై కోసం నిధులు ఇచ్చారు. దీనికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఏపీని తయారు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బంగారం గనులు ఉన్న జొన్నగిరి పేరును చారిత్రక పేరు స్వర్ణ గిరిగా మార్చాం. నిస్వార్ధంగా పనిచేసే కూటమి నేతలకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. భారత మాతకు వికసిత్ భారత్ - తెలుగు తల్లికి స్వర్ణాంధ్ర సంకల్పం చేశాం. స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్ స్టాపబుల్. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏపీకి నేను మేనమామ - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్!
సీఎం చంద్రబాబుతో కలిసి వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. స్వయంగా గ్రామ సభలే పంచాయితీలో పనుల్ని నిర్దేశించుకుంటాయని తెలిపారు.
తనను మధ్యప్రదేశ్ లో అంతా మామాజీ అని పిలుస్తారని.. ఇప్పుడు ఏపీకి కూడా తాను మేనమామనే అయ్యానని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడని.. ఏపీకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలకు ఆయన అందజేశారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎక్కడా చేయి విడిచి పెట్టేది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజున కనీసం ఒక మొక్క నాటేలా సంకల్పం తీసుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరవశ్రీధర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.






