రాధాకు టీడీపీ ఆఫర్... ఓకే చేస్తాడా...?
posted on: Jan 31, 2018 3:11PM

ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ గురించే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని వీడి...టీడీపీ చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాధా ఏదో పైకి మాత్రం తాను టీడీపీలో చేరేది లేదని చెబుతున్నా.. ఆయన పార్టీ మార్పుపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు రాధా కోరుకుంటోన్న సెంట్రల్ సీటునే మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. జగన్ కూడా ఆ సీటు విష్ణుకే ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో.. సెంట్రల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి సరిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు రావడంతో... రాధా ఇంకా అసంతృప్తికి గురవ్వడం... దానికి తోడు పాదయాత్రలో జగన్ పక్కన గౌతంరెడ్డి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక రాధా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.
మరోవైపు టీడీపీ కూడా రాధాను పార్టీలోకి తీసుకురావడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబే.. రాధాను కూడా తమ పార్టీలోకి లాగేసుకుంటే దక్షిణ కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గాన్ని మొత్తం టీడీపీ వైపునకు తిప్పుకున్నట్టే అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం... కొందరు టీడీపీ కాపు నేతల ద్వారా రాధాకు పార్టీలో చేరమని చంద్రబాబు కబురు కూడా పంపించారట. ఏపీలో ఇప్పటికే కాపులను తన వైపునకు తిప్పుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయిన ఆయన.. రాధాను కూడా తమ పార్టీలోకి లాగేసుకుంటే దక్షిణ కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గాన్ని మొత్తం టీడీపీ వైపునకు తిప్పుకున్నట్టే అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాధా ఒప్పుకుంటే మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాధాకు ఎక్కడో ఓ చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా...లేని పక్షంలో కాపులు బలంగా ఉన్న మచిలీపట్నం నుంచి ఆయన్ను ఎంపీ బరిలోకి దించాలన్నదే టీడీపీ ప్లాన్. మరి ఇప్పటికే వైసీపీ తీరుతో విసుగుపోయిన రాధా టీడీపీలో చేరుతారా..? టీడీపీ ఆఫర్ ను రాధా స్వీకరిస్తారా...? అన్నది చూడాలి.. ఏం జరుగుతుందో...?






.webp)



