వంగవీటి రంగా కుమర్తె పొలిటికల్ ఎంట్రీ
posted on Nov 16, 2025 7:29AM

వంగవీటి రంగా కుమార్తె వ ఆశాకిరణ్ తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం(నవంబర్ 16) ఉదయం ఆమె వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు. రాధా రంగా మిత్రా మండలి ఆధ్వర్యంలో తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. ఇక నుంచీ తాను పూర్తిగా ప్రజలతో మమేకమౌతాననీ, .ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాననీ ఆశాకిరణ్ ఈ సందర్భంగా చెప్పారు. కులం,మతం బేధం లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తివంగవీటి మోహన రంగా అన్న ఆమె, ఆయన రాజకీయ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ తన రాజకీయ ప్రవేశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.