స్వతంత్ర భారత్ కి ఉక్కు పునాదులేసిన ఉక్కు మనిషి!

posted on: Oct 31, 2016 12:40PM

 

కాలు, చెవ్వు, ముక్కు, ఆఖరుకు గుండె... ఇవన్నీ అంగాలు. అంతే కాదు, ఇవన్నీ ఒక నిర్ధిష్ట ఆకారంతో శరీరంలో ఏదో ఒక చోట వుంటాయి. కాని, రక్తం అలా కాదు. అసలు చాలా మంది రక్తం ఒక అంగం అనుకోరు కాని... అది మన శరీరమంతా వ్యాపించిన అతి కీలకమైన అంగం! రక్తం లేకుంటే మిగతావన్నీ వున్నా జీవితం నిరర్ణకమైపోతుంది! ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ మన ఆధునిక స్వతంత్ర భారతదేశానికి రక్తం లాంటి వాడే!

 

మన హైద్రాబాద్ సంస్థానంతో సహా వందలాది చిన్న చిన్న రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేసిన పటేల్ 31 అక్టోబర్ 1875న గుజరాత్ లో పుట్టారు. ఆయన ఒకవేళ అన్ని రాజ్యాల్ని అంత నేర్పుగా, ఓర్పుగా ఢిల్లీ కంట్రోల్ లోకి తీసుకుని రాకపోయి వుంటే ఇవాళ్ల భారతదేశం ఇలా వుండేదే కాదు. వందలాది కాశ్మీర్లలా రగులుతూ వుండేది. ఆఫ్రికా లాంటి ఖండంలా భారత ఉపఖండం చిన్న చిన్న పేద దేశాల సమూహం అయ్యేది. కాని, పటేల్ తానే భారతదేశానికి రక్తంలా మారి ఆసేతు హిమాచలం ప్రవహించారు! ఒక్కో రాజ్యాన్ని విలీనం చేసుకుంటూ... వినకపోతే విమోచనం చేసుకుంటూ ముందుకు పోయారు! అదే ఆయన అతి పెద్ద విజయం... 

 

వల్లభ్ భాయ్ పటేల్ గాంధీ, నెహ్రులతో పాటూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 1947లో మనకు స్వేచ్ఛ కలిగేనాటికి ఆయన అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు. నిజానికి అప్పటి దేశంలోని అన్ని కాంగ్రెస్ కమిటీలు పటేల్ కే ప్రధానిగా ఓకే చెప్పాయి కూడా. కేవలం ఒకట్రెండు పీసీసీలు మాత్రమే నెహ్రు కావాలని మద్దతు ప్రకటించాయి. అయినా గాంధీ సమక్షంలో నెహ్రునే తొలి ప్రధాని అయ్యారు. పటేల్ హో మంత్రిగా నిలువరింపబడ్డారు. అయినా కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన దేశ సేవ విరమించలేదు. నిస్వార్థంగా అరేబియా సముద్ర తీరంలోని జునాగఢ్ మొదలు ఎక్కడో వున్న అసోంలోని చిన్న చిన్న సంస్థానాల వరకూ అన్నిట్నీ భారతదేశం మ్యాపులోకి చేర్చారు.

 

సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ హ్యాండిల్ చేసిన వ్యవహారాల్లో మన హైద్రాబాద్ అత్యంత కీలకమైంది. ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పటికీ 1948 వరకూ జనానికి స్వాతంత్ర్యం రాలేదు. మిగతా దేశమంతా స్వేచ్ఛగా మారిపోయినా హైద్రాబాద్ రాజ్యంలోని ప్రజలు నిజాం నిరంకుశ పాలనలోని చీకటిలో మగ్గిపోయారు. చివరకు, ఆపరేషన్ పోలోతో పటేల్ హైద్రాబాద్ ను బేషరతుగా భారత్ లో విలీనం చేశారు. ఆయన ఆర్మీ బలంతో అలా చేయకుంటే ఇవాళ్ల హైద్రాబాద్ కూడా కాశ్మీర్ లా కాష్ఠమై రగిలిపోతూ వుండేది. అలా జరగనీయక భాగ్యనగరాన్ని భద్రంగా భారత్ లో ఐక్యం చేసిన ఆయనకు తెలుగు వారంతా ఎప్పటికీ ఋణపడి వుంటారు. అంతే కాదు, గుజరాత్ లోని జునాగఢ్ రాజ్యం కూడా పటేల్ హైద్రాబాద్ లాగే విజయవంతంగా విలీనం చేశారు. కాని, కాశ్మీర్ విషయంలో నెహ్రు తొందర పాటు చర్యల వల్ల ఇప్పటికీ సమస్య కొనసాగుతూనే వుంది. ఒకవేళ సర్ధార్ జీ కాశ్మీర్ రాజ్యంపై కూడా కన్ను వేసి వుంటే... ఈ పాటికి పాకిస్తాన్ బెడద మనకు వుండేదే కాదంటారు ఆయన అభిమానులు!
ఎవరి మాట ఎలా వున్నా జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకునే పటేల్ జయంతినాడు మనం ఆయన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఎందుకంటే, వల్లభ్ భాయ్ పటేల్ యావత్ జాతికి హాని చేసే చేత కాని శాంతి వచనాలు పలికిన వాడు కాదు. భరతమాతకి ఏదో మేలో అది మౌనంగా చేస్తూ పోయిన వరుణాస్త్రం...
 

google-ad-img
    Related Sigment News
    • Loading...