వైభవ్ సూర్యవంశీ ఇన్ బ్లూ జెర్సీ.. స్పష్టమైన సంకేతాలిచ్చిన బీసీసీఐ

posted on: Jun 3, 2026 10:04AM

ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఓ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన సునామీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ముంగిటకు చేరుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి, ప్రపంచ మేటి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియా తరఫున ఆడనున్నాడు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే అత్యున్నత స్థాయి క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను కనబరిచిన వైభవ్‌ను జాతీయ జట్టులోకి వేగంగా తీసుకురావాలని బీసీసీఐ  సెలక్టర్లకు  బలమైన సంకేతాలు పంపింది. వైభవ్ బ్యాటింగ్ శైలి, అతని మైండ్ సెట్ చూసిన బోర్డు పెద్దలు, అతనికి ఏది అవసరమో అది చేయాలని సెలక్షన్ కమిటీకి స్పష్టం చేయడంతో  వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీకి మార్గం సుగమమైంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నమోదు చేసిన గణాంకాలు  మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. టోర్నీలో ఆడిన  16 మ్యాచ్‌లలో నమ్మశక్యం కాని విధంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో   776 పరుగులు సాధించి, ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించిన ఈ బేబీ బాస్.. ఏకంగా 72 భారీ సిక్సర్లు బాదాడు. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్..  ఐపీఎల్ 2026లో 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్తో పాటు  ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ మెరుపు ప్రదర్శనే ఇప్పుడు అతడిని నేరుగా సీనియర్ జాతీయ జట్టుకు ప్రమోట్  అయ్యేలా చేస్తోంది.

ఈ యువ కెరటం భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా  సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన ఆయన, రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక సమావేశాల్లో సెలక్టర్లు అతని ప్రదర్శనను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటారన్నారు.  వైభవ్ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ నుంచి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందన్న ఆయన  ఈ నెలాఖరులో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వైభవ్‌కు తొలిసారిగా టీమిండియా నుంచి అధికారిక పిలుపు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

వైభవ్ సూర్యవంశీని వయసుతో సంబంధం లేకుండా వెంటనే భారత జట్టుకు ఎంపిక చేయాలని ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను బహిరంగంగానే కోరారు. ప్రస్తుతం ఇండియా  ఏ జట్టులో కొనసాగుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా సీనియర్ జట్టులోకి ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఒకవేళ ఇంగ్లండ్ లేదా ఐర్లాండ్ టూర్‌లో వైభవ్ అరంగేట్రం చేస్తే, అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రికార్డులను తిరగరాయడం ఖాయం. భారత క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలుకుతూ ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ బ్లూ జెర్సీలో అడుగుపెట్టే క్షణం కోసం దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...