వైభవ్‌ను ఆడించాల్సింది...పసికూనతో ఓటమిపై ఫ్యాన్స్ ఆగ్రహం

posted on: Jun 27, 2026 10:02AM

 

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ భావించారు. కానీ, అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, టీమిండియా తరఫున ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఐర్లాండ్ సిరీస్‌లో అతనికి అవకాశం వస్తుందని ఆశించినా, మేనేజ్‌మెంట్ మాత్రం వేరే వ్యూహంతో ముందుకు వెళ్లింది.

తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను పక్కన పెట్టడంపై భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడని, అతని నైపుణ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శ్రేయాస్ ప్రశంసించాడు. అయితే అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అతడిని ఆడించలేకపోయామని వివరించాడు.


బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఊహించని పరాజయాన్ని చవిచూసింది. పసికూనగా భావించే ఐర్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్‌కు గట్టి షాకిచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టును 34 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు మట్టికరిపించి, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే భారత్‌పై తమ మొదటి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టుకు ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా.. ఆ జట్టు అస్సలు తగ్గలేదు. కెప్టెన్ లోర్కాన్ టకర్ (50), గారెత్ డెలానీ (49) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. చివర్లో జార్జ్ డాక్రెల్ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, మరో ప్రధాన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు భారీ నష్టాన్ని చేకూర్చింది. అతడు తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 57 పరుగులు ఇచ్చుకున్నాడు.

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేసి అవుటయ్యాడు. అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు భారత్ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ, అతడు వెనుతిరిగిన వెంటనే భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలిపోయింది.

మిడిలార్డర్ బ్యాటర్లు సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) నిరాశపరిచారు. తిలక్ వర్మ, శివమ్ దూబే కాసేపు ప్రతిఘటించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఐరిష్ బౌలర్లు మాట్ హొలార్డ్, మాథ్యూ హంఫ్రీస్ తలా మూడు వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. దీంతో టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది.

ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా పేరున్న భారత్‌పై ఐర్లాండ్ సాధించిన ఈ విజయంపై క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐరిష్ జట్టు చూపిన పోరాట పటిమను కొనియాడుతున్నారు. అదే సమయంలో, భారత జట్టులో సీనియర్ల గైర్హాజరీ మరియు మిడిలార్డర్ వైఫల్యంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘోర పరాజయంతో మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందో, ఎలా పుంజుకుంటుందో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...