Latest News
ఆయన వల్ల కాంగ్రెస్ గెలవలేదు! కాంగ్రెస్ వల్లే ఆయన ఓడిపోయాడు!
posted on: Mar 15, 2017 5:39PM

మిడాస్ టచ్ అంటే మీకు తెలుసా? పూర్వ కాలంలో ఒక రాజు వుండేవాడట. ఆయనకు ఒక వరం వల్ల ఏది ముట్టుకున్నా బంగారమయ్యేదట. దాంతో ఆయన ఫుల్ హ్యాపీ! అయితే, తరువాత అదే వరం కొంపముంచింది! అన్నం, నీళ్లు ముట్టుకున్నా బంగారమైపోయి జీవితం దుర్భరమైంది! ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పకున్నాం అంటే...
ప్రశాంత్ కిషోర్ ... ఈయన ఒక స్ట్రాటజిస్ట్. అంటే వ్యూహకర్త! మనోడి పేరు బాగా జనంలోకి రావటానికి కారణం 2014 పార్లమెంట్ ఎన్నికలు. వాటిల్లో ప్రశాంత్ బీజేపీ కోసం పని చేశాడు. మోదీని ప్రధానిగా గెలిపించటంలో కీలక పాత్ర వుంది. ఆయన పన్నిన వ్యూహాలు నమోకి బాగా ఉపయోగపడ్డాయి. అందుకే, రిజల్ట్స్ తరువాత పీకే సారుకి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. వెంటనే బీహార్ ఎన్నికల్లో ఆయన్ని నితీష్, లాలూ టీమ్ బుక్ చేసుకుంది. మహాఘట్బంధన్ పేరుతో వారు బీజేపిని మట్టికరిపించటంలో సక్సెస్ అయ్యారు. ఇందులోనూ ప్రశాంత్ కిషోర్ హస్తం వుందని ప్రచారం జరిగింది. ఆయన ముట్టుకుంటే ఏ ఎన్నికలైనా బంగారమే అంటూ పేరొచ్చేసింది!
వరుస విజయాలతో మిడాస్ టచ్ వుందనిపించుకున్న ప్రశాంత్ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పని చేశాడు. మోదీతో కలిస్తే మోదీ రేంజ్లోనే సక్సెస్ వచ్చినట్టు... రాహుల్ తో కలిస్తే రాగా రేంజ్లోనే పీకేకి కూడా ఓటమి ఎదురైంది! ఇప్పుడు యూపీ ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ ను పట్టించుకునే వారే లేరనే స్థితి దాపురించింది! అందుకు కారణం, యూపీలో ఓటమి మాత్రమే కాదు... చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ లో కూడా ఆయన మ్యాజిక్ పని చేయకపోవటమే!
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు యూపీ, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ కు పని చేయకపోవటానికి కారణం ... అసలు ఆయన మాటని కాంగ్రెస్ నేతలు విననే వికనపోవటం! పక్కా కాంగ్రెస్ మార్కు కల్చర్ తో ప్రశాంత్ చెప్పేదేదీ కాంగ్రెస్ హైకమాండ్ వినలేదు, నేతలు పట్టించుకోలేదు, కార్యకర్తలు అమలు చేయలేదు. దాంతో పీకే ఖాతాలో చేదు ఓటమి జమకాక తప్పలేదు! అయినా... ఛరిష్మా వున్న నేతల్ని, అంకితభావంతో పని చేసే కార్యకర్తల్ని, పటిష్టమైన సంస్థాగత వ్యవస్థని సృష్టించుకోకుండా... ప్రశాంత్ కిషోర్లని అద్దెకు తెచ్చుకుంటే జనం ఓటు వేసేస్తారా? యూపీలో జరిగింది అదే! కాంగ్రెస్ మునిగింది. ఆ కాంగ్రెస్ ని నడుముకి కట్టుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా మునిగాడు!



.jpg)


