ప్రియాంకకు చెక్‌పెట్టేందుకు స్మృతి..!

posted on: May 31, 2016 2:28PM

దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. 400 అసెంబ్లీ సీట్లతో..80 లోక్‌సభ స్థానాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా యూపీ సొంతం. త్వరలో ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా పునర్వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ, ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలని బీఎస్పీ, స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ ఎవరి ప్లాన్‌లు వారు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో పార్టీలు తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొలుత రాహుల్ పేరు వచ్చింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు అంతకు ముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌పై అంత నమ్మకం పెట్టుకోవడానికి భయపడుతున్నారు.

 

దీంతో రాహుల్‌కు బదులు ప్రియాంక పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఎన్నికలు వచ్చినప్పు డల్లా ఇలాంటి వాదన రావడం సహజమే అయినా ఇప్పుడు ఈ వాదన యూపీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యూపీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌‌ను తీసుకొస్తున్న తరుణంలో ఆయన కూడా ప్రియాంకను రంగంలోకి దించితే విజయావకాశాలు మెరుగుపడతాయని అధిష్టానంతో అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బీజేపీ రెడీ అయింది. అందుకే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతీ ఇరానీని బరిలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజాదరణ కలిగిన నేతగా తన వాగ్థాటితో స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాలు విసరగలదని వారి ఆలోచన. ఇవన్నీ పక్కన బెడితే యూపీకి సీఎం అభ్యర్థిని నిర్ణయించడం అంత తేలిక కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంటాయి ఇక్కడ వ్యవహారాలు. బ్రాహ్మణులను ఎంపిక చేస్తే ఠాకూర్లకు కోపం, ఠాకూర్లను ఎంపిక చేస్తే యాదవులకు కోపం, దళితులను ఎంపిక చేస్తే, అగ్రవర్ణాలకు దూరం ఇలా సాగుతుంటాయి ఇక్కడి రాజకీయాలు. మరి ఎవరి స్ట్రాటజీ ఎంటో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...