పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన అమెరికా

posted on: Jan 19, 2015 2:19PM

 

ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదని ఊరికే అనలేదు పెద్దలు. ఈ విషయం అమెరికాని చూస్తే అర్ధమవుతుంది. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో, సరిహద్దుల వద్ద పాక్ భద్రత దళాలతో వేగుతున్న భారత్ సమస్య గురించి ఎంతగా మొత్తుకొన్నప్పటికీ అమెరికా పట్టించుకోలేదు. పైగా ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం చాలా గొప్పగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏటా వందల కోట్ల రూపాయలు దానికి కప్పం కడుతోంది. అప్పనంగా వచ్చిపడుతున్న ఆ డబ్బును పాక్ ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతోందో అమెరికా కనుగొందో లేదో తెలియదు.

 

భారత్ అభివృద్ధికి బ్రేకులు వేసేందుకు పాక్ వంటి దూర్త దేశాన్నిదానికి పక్కలో బల్లెంలా ఉంచడం చాలా అవసరమని అమెరికా భావిస్తోందేమో? అందుకే అది పాక్ ప్రభుత్వానికి అంత ఉదారంగా సాయం చేస్తోందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తన ఉగ్రవాదమూకలు భారత్ పై తరచూ దాడులు చేస్తూ అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొంటున్నప్పటికీ, అమెరికా మాత్రం పాక్ ప్రభుత్వాన్ని మెచ్చుకొంటూ దానికి భారీ నజరానాలు ముట్టజెప్పడం గమనిస్తుంటే ఆ అనుమానాలు నిజమేననిపించక మానదు.

 

కానీ ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసినప్పటి నుండి పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులతో కటువుగా ఉండవలసింది పోయి భారత్ పై ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు అది అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా డిల్లీకి వస్తున్న తరుణంలో దేశంలో ప్రధాన నగరాలలో ముఖ్యంగా డిల్లీ, ముంబై విమానాశ్రయాలలో ఉగ్రవాద దాడులు జరుగవచ్చని పదేపదే భారత, అమెరికా నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేస్తుండటం అందరినీ చాలా కలవరపరుస్తోంది.

 

ఈ పరిస్థితి చూసి చివరికి అమెరికా ప్రభుత్వం కూడా పాక్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు భారత్ లో ఉన్న సమయంలో జరిగే ఏ ఉగ్రవాద దాడితోనయినా పాకిస్తాన్ కు సంబంధం ఉందని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంటే తనకు ప్రమాదం ఉందని తెలిస్తే అమెరికా ఉపేక్షించదు. కానీ గత ముప్పై ఏళ్లుగా భారత్ పై పాక్ ప్రభుత్వం అండదండలతో జరుగుతున్న ఉగ్రవాద దాడులను కానీ, ఇకపై జరుగబోయే దాడులను గానీ అమెరికా ఏ మాత్రం పట్టించుకోదన్నమాట. స్వయంగా అమెరికా అధ్యక్షుడే భారత్ వస్తున్నారనే సంగతి తెలిసి కూడా భారత్ పై దాడులు చేసేందుకు పాక్ దుసాహసం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల ఇంకా అదే ఔదార్యం చూపించినట్లయితే అది అవివేకమే.

google-ad-img
    Related Sigment News
    • Loading...