Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పతనం వెనుక అమెరికా ఒత్తిడి.. సంచలనంగా మారిన సైఫర్ లీక్!
posted on: May 20, 2026 4:28PM
.webp)
పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక లీకైన దౌత్య పత్రం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. గతంలో కేవలం ఒక సాధారణ పార్లమెంటరీ అవిశ్వాస తీర్మానం ద్వారానే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని భావించినప్పటికీ, ఇటీవల వెలుగులోకి వచ్చిన దౌత్య సమాచారం ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడం వెనుక అంతర్జాతీయ శక్తుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ సైఫర్ వ్యవహారం ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
పాక్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ.. అంతర్గత రక్షణ వ్యవస్థల మౌన సమ్మతితో జరిగిన ఈ పరిణామాలు ఇప్పుడు ఆ దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. వివాదాస్పదంగా మారిన ఈ సైఫర్ అసలు కథ ఏమిటంటే, అది అప్పటి పాకిస్థాన్ రాయబారి వాషింగ్టన్లో జరిపిన అంతర్గత సమావేశానికి సంబంధించిన కీలక నివేదిక. అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డొనాల్డ్ లూతో పాక్ ప్రతినిధి అసద్ మజీద్ ఖాన్ జరిపిన ఈ సంభాషణలో అనేక సంచలన విషయాలు నమోదయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పాకిస్థాన్ అనుసరించిన తటస్థ విధానాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టినట్లు ఆ పత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనను తీవ్రంగా ఆక్షేపించిన అమెరికా అధికారులు, ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమై ఖాన్ పదవి నుంచి తప్పుకుంటేనే పాక్కు క్షమాభిక్ష లభిస్తుందనే తరహాలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దౌత్య పత్రాల్లోని అన్నీ క్షమించబడతాయి అనే ఒకే ఒక్క వాక్యం చుట్టూ ఇప్పుడు పాక్ రాజకీయం మొత్తం తిరుగుతోంది.
ఇమ్రాన్ ఖాన్, ఆయన మద్దతుదారులు దీనిని ఒక విదేశీ శక్తుల రెజీమ్ చేంజ్ కుట్రగా అభివర్ణిస్తున్నారు. తమ దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండటాన్ని సహించలేక, అమెరికా , స్థానిక సైనిక శక్తులు చేతులు కలిపి ప్రభుత్వ పతనానికి ఒత్తిడి తెచ్చాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను వాషింగ్టన్ తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఖాన్ తొలగింపు అనేది పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత రాజ్యాంగ ప్రక్రియ అనీ.. ఇందులో తమకు ఇసుమంతైనా సంబంధం లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా, ఇమ్రాన్ ఖాన్ మధ్య విభేదాలు ఒక్క రోజులో వచ్చినవి కావు. ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా బలగాలు వెనక్కి తగ్గిన తదనంతర కాలంలో.. ఆ ప్రాంతంలో నిఘా, సైనిక చర్యల కోసం పాక్ భూభాగాన్ని ఉపయోగించుకోవాలని సీఐఏ ప్రయత్నించినట్లు సమాచారం. దీనిని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు చేయడం అమెరికాకు సుతరామూ నచ్చలేదు. దీనికి తోడు ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించిన రోజే ఇమ్రాన్ మాస్కోలో ల్యాండ్ అవ్వడం పాశ్చాత్య దేశాలకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. పాక్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి ఇలాగే కొనసాగితే.. పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరి కావాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్థాన్ శక్తిమంతమైన సైన్యం, ఐఎస్ఐ పాత్రపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నుండి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి గురించి స్థానిక భద్రతా దళాలకు ముందే సమాచారం ఉన్నప్పటికీ, వారు దేశ ప్రధానిని రక్షించే ప్రయత్నం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానానికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా సైన్యం తన కింగ్ మేకర్ పాత్రను పోషించిందని విశ్లేషకులు అంటున్నారు.
పాక్లో ఎన్నికైన ప్రభుత్వాల కంటే కూడా తెరవెనుక ఉండే డీప్ స్టేట్ అంటే సైన్యం, గూఢచార సంస్థలు మాత్రమే విదేశాంగ, రక్షణ పరమైన కీలక నిర్ణయాలను శాసిస్తుందనేది బహిరంగ రహస్యం. ఇటీవల ఈ దౌత్య కేబుల్స్ యొక్క పూర్తి పాఠ్యం బాహ్య ప్రపంచానికి లీక్ కావడంతో ఇమ్రాన్ ఖాన్ గతంలో చేసిన విదేశీ కుట్ర ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. అయినప్పటికీ.. అధికారిక వర్గాలు, అమెరికా ప్రతినిథి వర్గాలు మాత్రం ఇది కేవలం దౌత్యపరమైన అసంతృప్తిని తెలియజేసే సంభాషణ మాత్రమేననీ.. దీనిని కుట్రగా పరిగణించలేమని బుకాయించే ప్రయత్నం చేస్తున్నాయి. న్యాయపరంగా దీనిని బలమైన సాక్ష్యంగా నిరూపించలేకపోయినా.. రాజకీయంగా మాత్రం ఇమ్రాన్ ఖాన్ తన కథనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఇది ఒక అస్త్రంగా మారింది.
ఈ అంతర్జాతీయ వివాదం రెండు ప్రధాన అంశాలను ప్రపంచం ముందు ఉంచింది. ఆర్థికంగా, సైనికంగా బలహీనంగా ఉన్న దేశాల సార్వభౌమత్వాన్ని మహాశక్తులు ఎంతవరకు శాసించగలవు అనేది మొదటి ప్రశ్న అయితే.. సొంత దేశ రక్షణ వ్యవస్థలు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎంతవరకు నియంత్రించగలవు అనేది రెండో ప్రశ్న. కేవలం ఓటింగ్ జరగడం, జాతీయ చిహ్నాలు కలిగి ఉండటం మాత్రమే పూర్తి స్వాతంత్ర్యం అనిపించుకోదని, విదేశాంగ, ఆర్థిక నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి ఉన్నప్పుడే ఆ దేశానికి నిజమైన సార్వభౌమత్వం ఉంటుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
చివరిగా.. పాకిస్థాన్ సైఫర్ వివాదం కేవలం ఒక దేశ అంతర్గత రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు.. ఇది మొత్తం దక్షిణాసియా దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక. బాహ్య శక్తులపై మితిమీరి ఆర్థికంగా ఆధారపడటం, దేశీయ రాజకీయాల్లో సైన్యానికి అనవసర ప్రాధాన్యత ఇవ్వడం, అంతర్గత బలహీనతలు ఏ విధంగా ఒక దేశ ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరుస్తాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. విమర్శకులు దీనిని రాజకీయ స్వార్థంగా కొట్టిపారేసినప్పటికీ, అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్లు, తెరవెనుక వ్యూహాలు ఒక దేశ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇమ్రాన్ ఖాన్ కేసు ఒక సజీవ ఉదాహరణ.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






