మనోజ్ సిన్హా.... లేదంటే రాజ్నాథ్... ఈరోజు తేలిపోవాల్సిందే
posted on: Mar 18, 2017 11:24AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. 18న ప్రభుత్వ ఏర్పాటుకి ముహూర్తం పెట్టుకున్నప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో తేలడం లేదు. యూపీ ఫలితాలొచ్చి ఏడు రోజులవుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల కంటే యూపీకి కమలనాథులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలంటే 2019లో యూపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులేస్తోంది.
యూపీ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కుల సమీకరణలపై, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆయన బృందం దృష్టి సారిస్తోంది. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంతోపాటు పార్టీలో అన్ని వర్గాలను కలుపుకువెళ్లే నేత కోసం అన్వేషిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయాలా లేక యాదవేతర బీసీలకు అవకాశం ఇవ్వాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. సీఎం పగ్గాలు ఓ వర్గానికిస్తే .....డిప్యూటీ సీఎంను మరో వర్గం నుంచి ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఏ ఎమ్మెల్యేకీ సీఎం సీటు ఎక్కే అవకాశం రాకపోవచ్చని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేంద్రం నుంచే బలమైన నేతను పంపుతారని భావిస్తున్నారు.
అయితే యూపీ సీఎం రేసులో కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ముఖ్యమంత్రి కేసులో లేనని ఆయనే స్వయంగా ప్రకటించినప్పటికీ, మనోజ్ సిన్హానే అందరికీ ఆమోదయోగ్యమైన, సమర్ధుడైన నాయకుడిగా ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మనోజ్ సిన్హా ముందంజలో ఉన్నా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య రేసులో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురిలో ఒక్కరు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మనోజ్ సిన్హానే ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు.




.jpg)


.webp)


