బడ్జెట్‌- బాదుడు లేదన్న మాటే కానీ...

posted on: Mar 1, 2016 12:09PM

 

ఆదాయపన్ను పరిమితులలో ఎలాంటి మార్పులూ లేవు! పైగా ఇంటి నిర్మాణం మీద తీసుకునే రుణాలకీ, అద్దె చెల్లింపులకీ కాస్తో కూస్తో మినహాయింపులు. కొత్తగా ప్రత్యక్ష పన్నులు ఏవీ లేవు. పైగా వస్తువుల ఖర్చును తగ్గించే విధంగా కార్పొరేట్‌ పన్నుని తగ్గించారు. చూడ్డానికి అంతా బాగానే ఉంది. కానీ ఎలాంటి ప్రత్యక్ష పన్నూ విధించకుండానే సెస్సు పేరుతో వీరబాదుడు బాదేశారు ఆర్థికమంత్రి. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు, స్వచ్ఛమైన పర్యావరణం, స్వచ్ఛభారత్‌.... ఇలా రకరకాల పేర్లతో అయిదు సెస్సులను విధించారు ఆర్థికమంత్రి. వీటి ద్వారా ఒక్క ఏడాదిలోనే 50,000 కోట్ల రూపాయలకు పైగా పిండుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

 

ఒకపక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తూనే ‘కృషి కల్యాణ్‌ సెస్‌’ పేరుతో సంబంధిత నిధులను మధ్యతరగతి భారతం నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పన్నుల పరిధిలోకి వచ్చే అన్ని సేవల మీదా ఈ సెస్‌ను 0.5 శాతం మేర విధించనున్నారు. రెస్టారెంటులు, విమానప్రయాణాలు, మొబైల్‌ సేవలు.... ఇలా మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల జీవితంలో భాగమైన సేవలు ఇక మీదట మరింత భారం కానున్నాయి. ఇక పర్యావరణ సెస్‌ కూడా పరోక్షంగా సాధారణ ప్రజల జేబుకి చిల్లు పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. స్వచ్ఛమైన పర్యావరణ పేరుతో బొగ్గు ఉత్పత్తి మీద టన్నుకు 200 రూపాయల వరకూ సెస్సుని మోగించారు.

 

దీంతో విద్యుత్‌ ఉత్పత్తి మరింత ప్రియం కానుంది. ఈ భారం ఎవరిమీద పడుతుందో చెప్పనవసరం లేదు కదా. ఇక మౌలిక రంగానికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం అంటూ కార్ల మీద ఇన్‌ఫ్రా సెస్‌ను విధించారు. దీని వలన కార్ల ధరలు 0.25% నుంచి 4% వరకూ అమాంతం పెరిగిపోనున్నాయి. ఇంట్లో వివాహంలాంటి శుభకార్యాలను తలపెట్టినప్పుడు నగలు, బ్రాండెడ్‌ దుస్తులను ఖరీదు చేయక తప్పని పరిస్థితి. ఇప్పడు ఈ రెండింటి మీద కూడా కస్టమ్స్‌ సుంకాన్ని పెంచారు. ఇంత చూసిన తరువాత బడ్జెట్లో బాదుడు లేదని ఎలా అనుకోగలం!

google-ad-img
    Related Sigment News
    • Loading...