ఇది అందరి బడ్జెట్.. ఆంధ్రుల బడ్జెట్!

posted on: Jul 10, 2014 5:05PM

 

కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దేశ ప్రజలందరి బడ్జెట్‌గా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ బడ్జెట్‌ను ఆంధ్రుల బడ్జెట్‌గా మరీ మరీ చెప్పుకోవచ్చును. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి, ఆంధ్రుల ఆవేదనను తగ్గించడానికి తాను కట్టుబడి వున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో సందర్భాలలో మాట ఇచ్చారు. ఆయన తన మాటకు కట్టుబడి ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ముదావహం. ముఖ్యంగా ఈ బడ్జెట్‌నందు ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఎయిమ్స్ ఆస్పత్రి, కాకినాడలో హార్డ్ వేర్ పార్కు, కృష్ణపట్నం రేవు అభివృద్ధి, అక్కడే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, ఇంకా విశాఖ పట్టణం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు... ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కి సంతోషాన్ని కలిగించేవే. విశాఖ - చెన్నై మధ్య 20 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు అంటే, ఒకటీ రెండు తప్ప అన్నీ మన రాష్ట్రంలోనే ఏర్పాటయ్యే అవకాశం వుంది. దేశంలో ఇంతవరకు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత విరివిగా వరాలు ఇచ్చిన సందర్భాలు లేవని చెప్పవచ్చు. సాధారణంగా ఒకే రాష్ట్రానికి ఒకేసారి ఇన్ని వరాలు ఇచ్చిన సందర్భంలో ఇతర రాష్ట్రాల వారు నొచ్చుకునే అవకాశాలు వుంటాయి. అయితే ప్రత్యేక పరిస్థితులలో వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇన్ని వరాలు ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం హర్షణీయం. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవడానికి ఈ బడ్జెట్‌లో లభించిన వరాలు శుభారంభాన్ని ఇస్తాయని భావించవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...