మోడీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ అద్భుతం!

posted on: Jul 10, 2014 4:32PM

 

కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌నే చాలా అద్భుతమైన బడ్జెట్‌గా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఎక్కువ అంశాలు ప్రజలకు ఆనందాన్ని కలిగించేవే వున్నాయని భావించవచ్చును. కొన్ని విషయాలలో ప్రజలకు కొంత భారం కలిగించే అవకాశం వున్నప్పటికీ అవి చిరునవ్వుతో భరించేవిగానే వుండటం చెప్పుకోదగ్గ విషయం. మొత్తం బడ్జెట్ కలిగించిన ఆనందం ముందు చిన్నచిన్న భారాలు పెద్ద లెక్కలోనివి కావు. మొత్తంమీద కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రజామోదాన్ని పొందే బడ్జెట్‌నే రూపొందించారని చెప్పవచ్చును. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్ మీద దేశవ్యాప్తంగా అందరి చూపులు నిలిచి వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వ బడ్జెట్‌ని చీల్చి చెండాడటానికి సిద్ధంగా వున్నది. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పుడు పార్లమెంటు సభ్యులు, టీవీల్లో బడ్జెట్ ప్రసంగాన్ని చూస్తున్న చాలామంది చాలా ఉత్కంఠను అనుభవించారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ మోదంగా వుంటుందా, ఖేదంగా వుంటుందా అన్న ‘సస్పె్న్స్’ వారిని ఎంతో ఉత్కంఠకి గురిచేసినది. అయితే జైట్లీ ప్రసంగం ముందుకు వెళ్తున్న కొద్దీ అందరి మనసులు తేలిక అవడం ప్రారంభమైనది. జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో దేశ ప్రజల మీద వరాల జల్లులు కురిపించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న వేళ జైట్లీ బడ్జెట్ ప్రసంగం దేశ ప్రజల మీద చల్లటి జల్లులు కురిపించిందనుటలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదని భావించవచ్చును. రైల్వే బడ్జెట్ దేశ ప్రజలకు ఎంత ఆహ్లాదాన్ని కలిగించిందో, సాధారణ బడ్జెట్ అంతకంటే ఎక్కువ ఆహ్లాదాన్ని కలిగించింది. ఎక్కువ వడ్డింపులు లేకుండా వరాల ప్రవాహంలా సాగిన నరేంద్రమోడీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దేశ ప్రజలకు మోదాన్నే కలిగించింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి కూడా వీలు లేని విధంగా బడ్జెట్ వుంది. అయితే ఈ బడ్జెట్ విషయంలో ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నీ ప్రతిపక్షంలో వుండి విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టుగా భావించవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...