Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిరాఘాటంగా రష్యా చమురు సరఫరా.. ఇండియా వ్యూహాత్మక ముందడుగు
posted on: Apr 24, 2026 10:25AM

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. పాశ్చాత్య దేశాల ఆంక్షల మధ్య భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి నిరాఘాటంగా చమురు సరఫరాను నిర్ధారించుకోవడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన మరిన్ని నౌకా బీమా సంస్థలకు గుర్తింపునిచ్చింది. ఇండియా నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా చమురు రవాణా చేసే ట్యాంకర్లకు బీమా రక్షణ కల్పించే సంస్థల సంఖ్యను పెంచడం ద్వారా.. సరఫరా గొలుసులో ఎటువంటి అడ్డంకులు లేకుండా భారత్ జాగ్రత్త పడుతోంది.
చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తున్న దేశం భారత్. అలాగే చమురు వినియోగంలో కూడా భారత్ ముందువరుసలోనే ఉంది. గణాంకాల ప్రకారం.. గత మార్చిలో భారత్ రష్యా నుండి రోజుకు సుమారు 2.25 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది, ఇది ఇప్పటివరకు నమోదైన గరిష్ట స్థాయి. ఈ నెలలో ఏప్రిల్ మాసంలో కూడా రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల సరఫరా కొనసాగుతుందని అంచనా. ప్రస్తుతం భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 50 శాతానికి చేరుకుంది. తక్కువ ధరకు లభిస్తున్న ఈ చమురు.. దేశ ఇంధన బిల్లు భారాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.
అయితే, రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా.. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా నౌకలకు బీమా కల్పించే ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ పి అండ్ ఐ క్లబ్స్ (పీఅండ్ఐ క్లబ్లులు) పై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఉంది. ఆంక్షల భయంతో ఈ సంస్థలు రష్యా చమురును రవాణా చేసే ట్యాంకర్లకు బీమా కవరేజీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. బీమా లేనిదే ఏ నౌకా కూడా సముద్రంలో ప్రయాణించడానికి వీలుండదు. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్ ఇప్పుడు రష్యాకు చెందిన 11 బీమా సంస్థలను అధికారికంగా గుర్తించింది. ఇందులో గాజ్ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్గోస్స్ట్రాఖ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు దుబాయ్కు చెందిన ఒక ఇస్లామిక్ పి అండ్ ఐ క్లబ్కు కూడా అనుమతి ఇచ్చింది.
ఈ బీమా సంస్థలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వివిధ కాలపరిమితులతో భారత్ గుర్తింపునిచ్చింది. దీనివల్ల పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలతో సంబంధం లేకుండా, రష్యా తన సొంత బీమా నెట్వర్క్ ద్వారా భారత్కు చమురును సరఫరా చేసే అవకాశం ఏర్పడింది. ఇది కేవలం ఒక వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు.. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని భారత్ ప్రపంచానికి విస్పష్టంగా చెప్పినట్లైంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో మరీ ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల చమురు రవాణా ప్రమాదం పడింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్, ఇటువంటి పరిస్థితుల్లో కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడటం ప్రమాదకరమని భావిస్తోంది. సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే.. రష్యా నుంచి వస్తున్న చౌక చమురును ఒక రక్షణ కవచంలా భారత్ వినియోగించుకుంటోంది.
దీర్ఘకాలికంగా చూస్తే, ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. తక్కువ ధర చమురు వల్ల ప్రభుత్వానికి సబ్సిడీల భారం తగ్గుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అయితే.. అంతర్జాతీయ ఆంక్షల గ్రే జోన్ లో వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల నుంచి ఎదురయ్యే దౌత్యపరమైన సవాళ్లను భారత్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. మీ ఆంక్షలు మీవి.. మా అవసరాలు మావి అనే స్పష్టమైన సందేశాన్ని భారత్ ఈ చర్య ద్వారా పంపింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. భారత విదేశాంగ విధానంలో ఇంధన భద్రత అనేది ఇప్పుడు అగ్రగామిగా మారింది. రష్యా బీమా సంస్థలకు పచ్చజెండా ఊపడం ద్వారా భారత్ ఒక బహుళ ధ్రువ ప్రపంచంలో తన స్వతంత్రతను చాటుకుంది. ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన మార్కెట్లో భారత్ పాత్రను మరింత కీలకం చేయనుంది.
- సీతారాం కంఠంనేని



.webp)


