Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై యూనికార్న్ సర్వే.. 60 శాతానికి పడిపోయిన రేటింగ్!
posted on: Jun 23, 2026 2:58PM
.webp)
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ సంచలన నివేదికను బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ ఆందోళనకరంగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. 100 శాతం సంతృప్తి ఆశించిన చోట ప్రభుత్వ ప్రస్తుత రేటింగ్ కేవలం 60 శాతం (5.9 మార్కులు) లోపు మాత్రమే నమోదవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి.. కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్కు గత ఏడెనిమిదేళ్లుగా ఒకే రకమైన ఫిర్యాదులు రావడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.
తమ సర్వేలో ముఖ్యంగా క్యాబినెట్లో సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయన్నారు. 2024 అధికార మార్పిడి తర్వాత యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ.. వారు జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నాని తేలిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తలెత్తిన డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు వెళ్లినప్పుడు, స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారని విశ్లేషించారు. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని మిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమైందన్నారు.
అటు కడప జిల్లాలో జూనియర్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారని, రాయలసీమలో సామాజిక సమతుల్యత లోపించిందని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు. అలాగే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా ఇంటర్నల్ డ్యామేజ్ తీవ్రంగా జరుగుతోందనీ.. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి టాస్క్గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని రవి విశ్లేషించారు.
మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్లపై నమోదైన సీఐడీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలను కూడా రవి వివరించారు. ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఓలు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్) ఇప్పుడు కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటివి కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయనిరవి విశ్లేషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ లాంటి సమర్థులను సరైన స్థానాల్లో ఉపయోగించుకోకపోవడం, రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వల్ల క్రింది స్థాయి అధికారుల ప్రమోషన్లు ఆగిపోయి డిపార్ట్మెంట్లో నైరాశ్యం అలుముకుందని సర్వే స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే బండి లాగిస్తోందనీ, రాజకీయంగా ఎదురవుతున్న అంతర్గత సవాళ్లను చల్లార్చడంలో విఫలమవుతోందని తన సర్వే నివేదిక తేటతెల్లం చేసిందని రవి చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే, ఈ రేటింగ్స్ మరింత దిగజారి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమనీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న 100 శాతం టాప్ ర్యాంక్ సాధించాలంటే కేవలం "పాస్ మార్కులు" సరిపోవని, తక్షణమే పరిపాలన, రాజకీయ సమన్వయంలో సమూల మార్పులు చేయాలని తమ సర్వే నివేదికలో తేలిందని యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి స్పష్టం చేశారు.



.webp)


