టర్కీలో సైన్యం తిరుగుబాటు.. పార్లమెంట్‌పై బాంబు దాడులు

posted on: Jul 16, 2016 11:11AM

ఉగ్రవాద దాడులతో ఇప్పటికే అట్టుడుకుతున్న టర్కీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు ప్రయత్నించింది. నియంతృత్వపాలన, ఉగ్రవాదం కారణంగానే దేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించింది...అయితే ఆ కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు టర్కీ ప్రధాని వెల్లడించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇస్తాంబుల్, అంకారా తదితర ప్రధాన పట్టణాల్లో యుద్ధ ట్యాంకులు తిరిగాయి.

 

పార్లమెంట్ భవనంపై సైన్యం మూడు బాంబులను ప్రయోగించడంతో ఎంపీలు పార్లమెంట్ షెల్టర్‌లో తల దాచుకున్నారు. టర్కీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై హెలికాఫ్టర్ గన్ షిప్పుతో సైన్యం కాల్పులు జరిపింది. అటు సైన్యాన్ని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. టిక్‌సిమ్ స్క్వేర్ వద్ద పోలీసులు, సైన్యం మధ్య  భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 17 మంది పోలీసులు సహా 42 మంది మృతి చెందగా..  మరో 130 మంది సైనికులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

తిరుగుబాటు చేసిన సైన్యం ఉపయోగించిన యుద్ధ విమానాన్ని కూల్చివేయాల్సిందిగా టర్కీ సైన్యానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. అటు సైనిక తిరుగుబాటును విదేశీ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఖండించారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మద్ధతు తెలపాలని ప్రజలకు ఎర్డోగన్ పిలుపునిచ్చారు. దాంతో పాటు తిరుగుబాటులో పాలుపంచుకున్న వారు త్వరలో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఎర్డోగన్ హెచ్చరించారు. టర్కీలో 1960, 1971, 1980, 1993లో సైన్యం తిరుగుబాటు చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...