తిరుపతి వాసులకు శ్రీవారి ఉచిత దర్శనం

ఇక నుంచీ ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి వాసులకు తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 3న తిరుమల వాసులకు ఉచిత దర్శనం లభించనుంది. ఇందుకోసం ఆదివారం (డిసెంబర్ 1)న టోకెన్లు జారీ చేస్తారు. తిరుమల, తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి స్థానికులు అంటే తిరుమతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన వారు వస్తారని టీటీడీ స్పష్టత ఇచ్చింది. 

ఈ ఉచిత దర్శనం ప్రతి నెలా మొదటి మంగళవారం ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. ఈ ఉచిత దర్శనం కోసం రెండు రోజుల ముందుగా టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం తిరుపతి నగరం తోపాటు రూరల్ మండలం, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన వారికి ఆధార్ కార్డు తప్పని సరి. ఇక వీటి కోసం  టీటీడీ మహతి ఆడిటోరియంలో ఒకటి,  తిరుమల కమ్యూనిటీ హాల్ లో మరోటి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.  తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు కొలువు దీరిన తరువాత జరిగిన మొదటి సమావేశంలోనే టీటీడీ చైర్మన్ తిరుపతి స్థానికులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని నిర్ణయించారు.