ఇరాన్ విషయంలో ట్రంప్ యూటర్న్

posted on: Jun 5, 2026 10:37AM

అంతర్జాతీయ రాజకీయాల్లో  కీలక పరిణామం సంభవించింది. నిన్నటివరకు  ఇరాన్ పై నిప్పులు చెరిగిన అగ్రరాజ్యధినేత డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.   ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సమావేశం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం  కుదిరితే, తాను ఖచ్చితంగా ఇరాన్ అత్యున్నత నేతను కలుస్తాననీ, అలా కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తాననీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్   ఈ రకమైన సానుకూల వ్యాఖ్యలు రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను సైతంవిస్మయానికి గురిచేస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో కేవలం భేటీ ప్రకటన మాత్రమే కాదు, ఇరాన్ అణు విధానంపై కూడా ట్రంప్ తన   వైఖరిని  మార్చుకున్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ దేశం నుంచి పూర్తిగా తరలించాలనే నిబంధనను పక్కనబెట్టారు. ప్రస్తుతం ఆ యురేనియం అంతా భూగర్భంలో కట్టుదిట్టమైన భద్రతా నిఘాలో ఉందని, దాన్ని బయటకు తీయడానికి లేదా తరలించడానికి అమెరికా సైన్యాన్ని పంపే ఉద్దేశం తనకు ఇసుమంతైనా  లేదని ట్రంప్  చెప్పారు.

గతంలో ఇరాన్‌తో శాంతి చర్చలు జరగాలంటే యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించాల్సిందేనని పదే పదే డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇలా యూ-టర్న్ తీసుకోవడం ఇరాన్ పట్ల అమెరికా మార్పునకు స్పష్టమైన సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ ఇరాన్‌పై కఠిన ఆంక్షలు, సైనిక దాడులతో విరుచుకుపడిన ట్రంప్.. ఇప్పుడు శాంతి ఒప్పందం కోసం ఇంతగా దిగిరావడం విశేషం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...